అంచనాలకు మించిన కోటక్ లాభాలు

by  |
అంచనాలకు మించిన కోటక్ లాభాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ 2020-21 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 26.26 శాతం నికర లాభాలతో రూ. 2,184.48 కోట్లను నమోదు చేసింది. గతేడాది బ్యాంకు రూ. 1,724.48 కోట్ల లాభాలను ఆర్జించింది. పన్నురేట్ల తగ్గింపుతో పాటు బ్యాడ్ లోన్ల కోసం కేటాయింపులూ క్షీణిచడం వల్లే లాభాలను దక్కించుకున్నట్టు బ్యాంకు వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం..బ్యాంకు తన కార్యకలాపాల వడ్డీ ఆదాయానికి, డిపాజిటర్లకు చెల్లించే వడ్డీకి మధ్య వ్యత్యాసం 16.8 శాతం పెరిగి రూ. 3,913 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 2.55 శాతం, నికర ఎన్‌పీఏలు 0.64 శాతంగా నమోదైనట్టు బ్యాంకు తెలిపింది.

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా ఆగష్టు 31 నుంచి ఎన్‌పీఏలను గుర్తించలేదని బ్యాంకు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో సగటు సేవింగ్స్ డిపాజిట్లు 32 శాతం పెరిగి రూ. 1,06,442 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి రూ. 80,425 కోట్లు. సగటు కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 10 శాతం పెరిగి రూ. 36,610 కోట్లకు చేరుకున్నాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సోమవారం మార్కెట్లో కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్ 1.41 శాతం క్షీణించి రూ. 1,363.50 వద్ద ట్రేడయింది.

కాగా, హిందూజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంకును కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ల మార్పిడి ద్వారా స్వాధీనం చేసుకోనుందనే వార్తలు సోమవారం చక్కర్లు కొట్టాయి. ఇండస్ఇండ్ బ్యాంకు ప్రమోటర్లుగా ఉన్న హిందూజా గ్రూప్ కొంత వాటాను తీసుకుంటారని ఓ నివేదిక తెలిపింది. అయితే, దీనిపై స్పందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రతినిధి నిరాకరించారు. అదేవిధంగా, ఇవన్నీ పుకార్లు మాత్రమే అని ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈవో సుమంత్ స్పష్టం చేశారు. ఇదివరకే ఈ అంశంపై స్పష్టత ఇచ్చామని, ఇవన్నీ నిరాధారమైన వార్తలేనని ఆయన వివరించారు.


Next Story

Most Viewed