పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు మంత్రి కొప్పుల ఆదేశం

by  |
పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు మంత్రి కొప్పుల ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జహంగీర్ పీర్ దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను మరింత వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సుమారు రెండు గంటల పాటు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జేపీ, మౌలాలీ, పహాడీ షరీఫ్ దర్గాలు, మక్కా మసీదు, అనీసుల్ గుర్భాలలో కొనసాగుతున్న పనులు.. కోకాపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణ విషయంలో నెలకొన్న అడ్డంకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జేపీ దర్గా విస్తరణకు సంబంధించిన భూసేకరణ పనులను మైనారిటీ సంక్షేమ శాఖాధికారులతో సమన్వయం చేసుకుంటూ తక్షణమే పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయకుమార్ కు ఆదేశాలిచ్చారు.

నగరంలో వక్ఫ్ బోర్డు కు చెందిన 11 విలువైన ఆస్తులను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ-టెండర్ ద్వారా లీజు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇమామ్, మౌజంలకు నెలనెలా జీతాలు చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకులను తొలగించడానికి మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఇద్దరు మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోకాపేటలో క్రిస్టియన్ భవన్ కోసం కేటాయించిన స్థలం విషయంలో ఉప్పెర (సగర) సంఘం నాయకులు కోర్టులో కేసు వేసిన విషయాన్ని అధికారులు వివరించారు. ఆ సంఘం నాయకులతో మాట్లాడి కేసును వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు సూచించారు. ఈ సమావేశంలో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీం, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, తదితర అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed