రేవంత్‌కు అండగా కోమటిరెడ్డి.. ఫుల్ జోష్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు

by  |
రేవంత్‌కు అండగా కోమటిరెడ్డి.. ఫుల్ జోష్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఈ నెల 18న నిర్వహించే దళిత, గిరిజన దండోరా మళ్లీ ప్రశ్నార్థకంలో పడింది. ఇప్పటికే ఇబ్రహీంపట్నం నుంచి మహేశ్వరం సెగ్మెంట్‌లోని ఔటర్ రింగ్​రోడ్డు సమీపంలోకి సభను మార్చారు. కానీ ఇక్కడ కూడా ట్రాఫిక్ ​సమస్య ఉంటుందని పోలీసులు అనుమతి ఇవ్వలేమంటూ సూచించారు. దీంతో సభను నిర్వహిచండంపై కాంగ్రెస్‌లో ఆందోళన నెలకొంది.
మరోవైపు ఇంద్రవెల్లి సభ విజయవంతం కావడంతో పార్టీ నేతల్లో మార్పు వస్తోంది.

ఇప్పటి వరకు టీపీసీసీపై అలిగి.. ఆరోపణలు చేసుకుంటూ వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి దళిత దండోరాకు వస్తానని ప్రకటించారు. అయితే సభ నిర్వహించే తేదీని మార్చాలంటూ సూచించారు. ఇప్పటికే పోలీసులు అనుమతి నిరాకరిచండంతో ఇబ్రహీంపట్నం నుంచి సభను మహేశ్వరం సెగ్మెంట్ ​పరిధిలోని ఓఆర్‌ఆర్ ​సమీపంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి సూచనతో ఈ నెల 18న నిర్వహించనున్న ఈ సభ వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. శనివారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో సభ నిర్వహణపై నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

రేవంత్, కోమటిరెడ్డి చర్చలు..

శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డితో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ ప్రకటన తర్వాత తొలిసారిగా వీరిద్దరు మాట్లాడుకున్నారు. అయితే ప్రస్తుతం పార్లమెంటరీ కమిటీ పర్యటన ఉన్నందున ఈ నెల 18న నిర్వహించనున్న సభకు హాజరుకాలేనని తెలియజేశారు. సాధ్యమైనంత వరకు సభను వాయిదా వేసుకోవాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. 21వ తేదీ తర్వాత సభ ఎప్పుడు పెట్టినా హాజరయ్యేందుకు అభ్యంతరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు దళిత, గిరిజన దండోరా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ ​పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీకి చెందిన నాయకులను స్థానిక నేతలతో సమన్వయం చేసుకునేందుకు సమన్వయకర్తలను నియమించింది. రెండు రోజుల కిందట రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తూ రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. 119 నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లతో శుక్రవారం సాయంత్రం ఇందిరా భవన్‌లో సమావేశమయ్యారు. ప్రతీ నియోజకవర్గం నుంచి ఆయా జిల్లాల పరిధిలో దండోరా కార్యక్రమం నిర్వహించి సభను విజయవంతం చేయాలంటూ సూచించారు.

మళ్లీ అనుమతికి నిరాకరణ..

కాంగ్రెస్ దళిత దండోరా రెండో సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. 40 వేల మందితో సభ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అనుమతి కోరింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో సభ ఏర్పాటు చేయడం వలన ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరో చోట సభ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో మరో చోట సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

Next Story

Most Viewed