అంత మంది రైతుల మరణానికి మోడీ సంతాపం తెలపకపోవడం సిగ్గుచేటు.. కోదండరెడ్డి

by  |
kodanda reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రధాని మోడీ సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటూ కూడా చట్టాలను సమర్థిస్తూ మాట్లాడడం రైతులను తప్పుదోవ పట్టించడమేనని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శలు చేశారు. గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్ల చట్టాలను మోడీ వెనక్కి తీసుకోవడం రైతుల విజయమని కొనియాడారు. రైతుల వెనక కాంగ్రెస్ ఉండి పోరాటం చేసిందన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ చేసిన పోరాటంలో 831 మంది రైతుల మృత్యువాత పడ్డారని, అయితే ప్రధాని మోడీ కనీసం వాళ్లకు సంతాపం కూడా తెలపలేదని మండిపడ్డారు.

వారికి పరిహారం కూడా ఇస్తామని ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు. రైతుల్లో అనేక మంది మహిళలు కూడా పాల్గొన్నారని, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని సైతం పోరాటం చేశారన్నారు. కరోనా సమయంలోనూ వెనుకడుగు వేయకుండా పోరాడారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులపై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్​చేశారు. కరోనా సమయంలో నష్టపోయిన పంటలకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మహిళ కాంగ్రెస్ చైర్మన్​ సునీతా రావు, నేతలు ఫిరోజ్ ఖాన్, జగన్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed