మంత్రి గంగులను కలిసిన కిన్నెర మొగులయ్య.. ఎందుకో తెలుసా.?

by  |
మంత్రి గంగులను కలిసిన కిన్నెర మొగులయ్య.. ఎందుకో తెలుసా.?
X

దిశ, తెలంగాణ బ్యూరో : పన్నెండు మెట్ల కిన్నెర వాయిద్యకారుడు, భీమ్లానాయక్ పాటతో పాపులర్ అయిన తెలంగాణ కళాకారుడు దర్శనం మొగులయ్య గురువారం రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కలిశారు. తెలంగాణ ప్రభుత్వం తనకు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేసిన మొగులయ్య, గతంలో ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని సీఎం చేతుల మీదుగా అందుకోవడమే తన జీవితాన్ని మార్చిందని అన్నారు. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో తన కళను చేర్చిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరఫున కళాకారుల పింఛన్ 10వేల సహాయాన్ని తమ కుటుంబానికి కల్పించినందుకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కిన్నెర మొగులయ్య పాటను ఆలపించారు.

కిన్నెర వాయిద్యాన్ని అభివృద్ధి చేసి మరిన్ని వాయిద్యాలు తయారు చేసి కళాకారులను తయారు చేయాలనే తన లక్ష్యానికి ప్రభుత్వ సాయాన్ని అర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ కిన్నెర మొగులయ్యని శాలువాతో సన్మానించి, తక్షణ ఆర్థిక సాయాన్ని అందజేశారు. సీఎం అనేక రకాలుగా కళాకారులకు అండగా ఉన్నారని, ఉద్యోగాలు సైతం ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాలను నిరంతరం ప్రోత్సహిస్తుందన్నారు. మొగులయ్యకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా రంగానికి చెందిన డీఏం రవిందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed