భారత్ లో 2 లక్షల కార్లే మా లక్ష్యం : కియా మోటార్స్!

by  |
kia-car
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ కారణంగా ఎదుర్కొన్న సవాళ్లను అధిగమిస్తూ ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా మొటార్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా మాత్రమే 2 లక్షల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కరోనా పరిణామాల తర్వాత వినియోగదారులు ఎక్కువగా వ్యక్తిగత వాహనాలపై ఆసక్తి చూపిస్తున్న తరుణంలో డిమాండ్ బలంగా ఉంటుందని భావిస్తున్నట్టు కంపెనీ అధికారి చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 50 వేల యూనిట్లను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

గతేడాది కియా మోటార్స్ ఇండియా దేశీయ మార్కెట్లో మొత్తం 1,55,678 యూనిట్లను విక్రయించగా, అంతర్జాతీయంగా 40,440 యూనిట్లను ఎగుమతి చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ మొదటి ప్రాధాన్యత సరఫరాలో ఉన్న సవాళ్లను అధిగమించడం. తర్వాత సాధారణ పరిస్థితులకు చేరుకోవడం. 2021-22లో దేశీయంగా 2 లక్షల యూనిట్లతో పాటు, 50 వేల ఎగుమతులను సాధించడమే ప్రస్తుత లక్ష్యంగా పెట్టుకున్నామని’ కియా మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ అన్నారు. ఇటీవలే కంపెనీ ప్రారంభం నుంచి మొత్తం 3 లక్షల యూనిట్ల అమ్మకాల మార్కును చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ మొత్తం 4 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని చేరుకోవాలని భావిస్తోంది.


Next Story