మీ ఆట అయిపోయింది.. ఇక ఇంటికే.. దీదీపై పీఎం మోడీ ఫైర్

by  |
pm modi comments on bengal cm
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పని అయిపోయిందని.. ఈ ఎన్నికలతో ఆమె ఇంటికి వెళ్లడం ఖాయమని ప్రధాని మోడీ అన్నారు. ఆమె ఎన్నికల నినాదం ‘ఖేలా హోబె’ (ఆట మొదలైంది)ని ప్రస్తావిస్తూ.. ‘ఖేలా శేశ్ హోబె.. వికాస్ ఆరంభ్ హోబె’ (ఆట అయిపోయింది. ఇక అభివృద్ధి మొదలు కానుంది) అని చెప్పారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా గురువారం పురులియాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ మమతా బెనర్జీ పదేళ్ల పాలనపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దీదీ.. మీరు పదేళ్లు ఆడారు. (ఆమె ఖేలా హోబె నినాదాన్ని ఉద్దేశిస్తూ) ఇక మీ ఆట అయిపోయింది. బెంగాల్‌లో అభివృద్ధి ప్రారంభం కానున్నది. మీరు ఆట గురించి మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ మాత్రం ఉద్యోగాలు, విద్య, పక్కా ఇళ్లు, శుద్ధమైన తాగునీరు గురించి మాట్లాడుతున్నది’ అని అన్నారు.

మమతా బెనర్జీ పాలనపై ప్రధాని ప్రస్తావిస్తూ.. ‘గడిచిన పదేళ్లుగా మీరు ప్రజలను అణచివేతకు గురి చేస్తున్నారు. దుర్గా మాత ఆశీస్సులతో మీరు ఓడిపోవడం ఖాయం’ అని అన్నారు. తృణమూల్‌కు కొత్త అర్థాన్ని చెబుతూ.. టీఎంసీ అంటే ‘ట్రాన్స్‌ఫర్ మై కమిషన్’ అని ఎద్దేవా చేశారు. కట్ మనీ (బెంగాల్‌లో జరిగిన స్కాం) స్కాం వల్ల పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన విమర్శించారు.

బెంగాల్‌ను పాలించిన లెఫ్ట్, టీఎంసీలు రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడంలో విఫలమయ్యాయనీ, కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ అభివృద్ధి పరుగులు పెడుతుందని పీఎం తెలిపారు. మమతా పాలన కారణంగానే పురులియాలో వలసలు ఎక్కువవుతున్నాయనీ, ఇక్కడ ప్రజలకు కనీసం తాగునీరు కూడా దొరకడం లేదని మోడీ విమర్శించారు.

Next Story