మరికాసేపట్లో ఈటల రాజేందర్ కీలక ప్రకటన

by  |
మరికాసేపట్లో ఈటల రాజేందర్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఈటల రాజేందర్.. ఈ పేరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈటలపై ఏప్రిల్ 30న అసైన్డ్ భూముల వ్యవహారంపై సీఎంకు ఫిర్యాదు అందగా.. అదే రోజు ఏసీబీ, విజిలెన్స్ అధికారుల విచారణకు సీఎం ఆదేశించడం ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. టీఆర్ఎస్ పార్టీలో సీనియర్‌ లీడర్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాత మే 1న కలెక్టర్ విచారణ చేసి.. మరుసటి రోజే సీఎస్‌కు ప్రాథమిక నివేదిక పంపించడం చర్చనీయాంశం అయింది. ఇక అదే రోజు మంత్రి వర్గం నుంచి ఈటలను బర్త్ రఫ్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు.

ఈ పరిణామాలతో హైదరాబాద్ నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్‌కు మే 3 వెళ్లారు. 4వ తేదీన ఎన్‌ఆర్‌ఐలతో వర్చువల్ మీటింగ్‌ నిర్వహించారు. ఆ తర్వాత మద్దతుదారులు, అనుచరుల నుంచి అభిప్రాయాన్ని సేకరించారు. రాజకీయ భవిష్యత్తుపై వరుసగా కాంగ్రెస్-బీజేపీ రాష్ట్ర నాయకులు, అధిష్టానంతో భేటీలు నిర్వహించారు. మే 11న భట్టి విక్రమార్క, మే 12న రాజ్యసభ సభ్యుడు డీఎస్, మే 15 అపాయింట్‌మెంట్ కోసం ఉత్తమ్‌కు ఫోన్, మే 22, 24న బండి సంజయ్‌‌, మే 24న కిషన్ రెడ్డి, భూపేందర్ యాదవ్‌లతో వరుసగా సమావేశాలు నిర్వహించి రాజకీయ వేడి పుట్టించారు.

ఆ తర్వాత మే 30న ఢిల్లీకి వెళ్లారు ఈటల. ఆ మరుసటి రోజే మే 31న నడ్డాతో సమావేశమయ్యారు. ఢిల్లీలోనే కిషన్ రెడ్డి, బీజేపీ నేత సంతోష్ జీతో చర్చలు జరిపి.. జూన్ 3న హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరికాసేపట్లో ఈటల రాజేందర్ మీడియా ముందుకు రానున్నారు. అయితే, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. పార్టీ మార్పుపై కూడా ప్రకటన చేస్తారని చెబుతున్నారు. దీనిపై స్పష్టత రావాలంటే మరికాసేపు వేచిచూడాల్సిందే.


Next Story