స్వీపర్ టు ప్రెసిడెంట్

by  |
స్వీపర్ టు ప్రెసిడెంట్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమే. గతంలో చాయ్‌వాలానని చెప్పుకునే నరేంద్ర మోదీ, భారత దేశానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. పేపర్ ‌బాయ్‌ నుంచి దేశ రాష్ట్రపతిగా ఎదిగిన దివంగత ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం జీవితమూ ఆదర్శప్రాయమే. ఇదే క్రమంలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్య రాజేంద్రన్ అనే కేరళ యవతి.. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి, దేశంలోనే అతి చిన్న వయసులో మేయర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్నటివరకు పంచాయతీ ఆఫీసులో చెత్త ఊడ్చి, బూజు దులిపి, కుర్చీలను తుడిచిన ఓ మహిళ.. ఇప్పుడు అదే పంచాయతీకి అధ్యక్షురాలిగా ఎన్నికవడం విశేషం. కొన్ని రోజుల కిందటి వరకు పారిశుధ్య పనులు చేసిన ఆనందవల్లి.. ఇక రాజకీయాలను శుభ్రం చేసేందుకు సిద్ధమైంది.

కేరళ, కొల్లం జిల్లాలోని పతనపురం బ్లాక్ పంచాయతీ నందు 2011లో తాత్కాలిక పారిశుధ్య కార్మికురాలుగా ఉద్యోగం ప్రారంభించింది ఆనందవల్లి. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో తలవూర్ డివిజన్ నుంచి సీపీఎ తరఫున పోటీచేసి 654 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. ఇక ఆనందవల్లి భర్త మోహన్, సీపీఐ(ఎం) స్థానిక కమిటీ సభ్యుడు కాగా, పెయింటింగ్ పని కూడా చేస్తాడు. ఆమె భర్తతో పాటు తనకు కూడా స్థానికంగా మంచిపేరే ఉండటంతో రాజకీయాల్లోకి ఆహ్వానించిన సీపీఐ పార్టీ.. ఆమెను పంచాయతీ అధ్యక్షురాలిగా చేయడం విశేషం.

‘నా జీవితంలోనే ఇది సంతోషకరమైన రోజు. ఆఫీసులో పని ఎలా జరుగుతుందో రోజూ పరిశీలించేదాన్ని కానీ.. అధికారిక కార్యకలాపాలు, పేపర్ వర్క్, ఇతర పనులను నేర్చుకోవాలి. అందుకే పదవి చేపట్టడానికి కొంచెం భయపడ్డాను. కానీ పార్టీ పెద్దలు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి కొత్త బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహించారు. ఈ బ్లాక్ పంచాయతీని ఓ రోల్ మోడల్‌గా మార్చేందుకు కష్టపడతాను. ఇప్పుడు నాపై బాధ్యత పెరిగింది, అందుకు తగ్గట్లుగా శక్తివంచన లేకుండా కృషి చేయడంతో పాటు నా బ్లాక్‌లోని ప్రజలకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాను’ అని ఆనందవల్లి చెప్పుకొచ్చింది.

13 సభ్యుల పంచాయతీలో ఎల్డీఎఫ్ ఏడు సీట్లలో విజయం సాధించగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మిగిలిన ఆరు స్థానాల్లో విజయం సాధించింది.

Next Story

Most Viewed