సాగు చట్టాలను రద్దు చేయండి : కేరళ అసెంబ్లీ 

by  |
సాగు చట్టాలను రద్దు చేయండి : కేరళ అసెంబ్లీ 
X

తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చని మూడు నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని కేరళ అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా తీర్మానించింది. సీఎం పినరయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మొత్తం 140 మంది ఎమ్మెల్యేలు మూజువాణి ద్వారా సమర్థించారు. కేరళలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ కూడా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకించారు. తొలుత సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని విమర్శించినప్పటికీ చివరికి ఆమోదించారు.

ప్రజాస్వామిక స్ఫూర్తితో తాను ఈ తీర్మానాన్ని ఆమోదించానని, కానీ, తీర్మానంలో ఉపయోగించిన కొన్ని పదాలపై తనకు అభ్యంతరమున్నదని, వాటినే తన ప్రసంగంలో ప్రస్తావించానని బీజేపీ ఎమ్మెల్యే ఓ రాజగోపాల్ తెలిపారు. మధ్య దళారులను తొలగించాలన్న లక్ష్యంతో ఈ చట్టాలు చేసినట్టు కేంద్ర చెబుతున్నదని, దళారులే లక్ష్యమైతే స్టోరేజీ వ్యవస్థను వికేంద్రీకరిస్తే చాలునని సీఎం పినరయి సూచించారు. అంతేకానీ, కార్పొరేటీకరణ చేయాల్సిన అవసరం లేదని విమర్శించారు. ‘కేంద్ర ప్రభుత్వం కార్పోరేటీకరణ చేయాలని చూస్తున్నది.

అందుకే రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రం వెంటనే వారి డిమాండ్లను శ్రద్ధగా ఆలకించి పరిష్కరించాలి. చర్చల్లో కీలకమైన చట్టాల రద్దుపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు వస్తున్న సంఘీభావాన్ని గుర్తించి చట్టాలను రద్దు చేయడం మంచిది’ అని పేర్కొన్నారు. సాగు రాష్ట్ర జాబితాలోని అంశమని, కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తు్న్నదని కేరళ కాంగ్రెస్ లీడర్ పీజే జోసెఫ్ అన్నారు. ఉత్తర ఇండియా తరహాలోనే కేరళలోనే నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని చెప్పారు.

Next Story

Most Viewed