బీజేపీలోకి కేసీఆర్ సన్నిహితుడు ?

by  |
బీజేపీలోకి కేసీఆర్ సన్నిహితుడు ?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోర పరాజయంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలే అవకాశాలు కనపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి టీఆర్ఎస్‌లో కేసీఆర్ సన్నిహితుడిగా పేరున్న మాజీ మంత్రి చంద్రశేఖర్‌.. కొన్ని కారణాలతో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి సీటు ఇస్తారని ఆశించినా భంగపాటు ఎదురుకావడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయి, మళ్లీ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు.

కేసీఆర్‌కు సన్నిహితుడిగా ముద్ర
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు పెద్దన్న పాత్ర పోషించిన చంద్రశేఖర్.. కేసీఆర్‌‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. అప్పట్లో బలంగా ఉన్న టీడీపీ, కాంగ్రెస్ నేతలను ఎదుర్కోవడంలో మంచి పేరు సంపాదించారు. టీఆర్ఎస్‌లో ఇబ్బందులు తలెత్తడంతో కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో ప్రాధాన్యత దక్కక పోవడం, ఇదేక్రమంలో పార్టీకి భవిష్యత్‌ లేదని ఆలోచించే పార్టీ మారేందుకు చంద్రశేఖర్ నిర్ణయం తీసుకున్నారని జిల్లా రాజకీయాల్లో ప్రచారం చక్కర్లు కొడుతోంది.

రెండుసార్లు వికారాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన చంద్రశేఖర్‌కు తనసొంత నియోజకవర్గం కాకుండా చెవెళ్ల నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వికారాబాద్ నియోజకవర్గంలో మాజీమంత్రి ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇద్దరు నేతలు ఒకే నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో.. హైకమాండ్ ప్రసాద్‌ వైపునకే మొగ్గు చూపుతోంది. దీంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న చంద్రశేఖర్‌ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కాషాయ పార్టీ పెద్దలతో సంప్రదింపులు సైతం జరిగినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసుకొని బీజేపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.


Next Story

Most Viewed