32 కొత్త కేసులు, ఒకరి మృతి

by  |
32 కొత్త కేసులు, ఒకరి మృతి
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆగడంలేదు. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారికి, వారితో కలిసున్నవారికీ, కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించామంటూ ప్రభుత్వం చెప్తున్నా కొత్త కేసులు మాత్రం పుడుతూనే ఉన్నాయి. అయితే పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయినవారికి ఎలా సోకిందనేది మాత్రం ప్రభుత్వం వెల్లడించడం లేదు. దీంతో కొత్త కేసులన్నీ ప్రైమరీ కాంటాక్టులకు సంబంధించినవా లేక సెకండరీ కాంటాక్టులవా లేక కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ద్వారా సోకుతున్నవా అనేది స్పష్టం కావడంలేదు. సోమవారం సాయంత్రానికే కొత్తగా 32 పాజటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఇప్పటికే 16 మంది చనిపోగా మరొక వ్యక్తి సోమవారం చనిపోయినట్లుకూడా వెల్లడించింది. రాష్ట్రం మొత్తం మీద నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అధికం జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీలకు చెందినవే కావడంపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో సోమవారం లోతుగా సమీక్షించారు. నగరాన్ని జో్న్లవారీగా విభజించి ఒక్కో జోన్‌ను ఒక్కో యూనిట్‌గా పరిగణించి ప్రత్యేకంగా కట్టడి కోసం అధికారులను నియమించాలని సీఎం ఆదేశించారు.

‘‘గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ వచ్చిన వారి ద్వారా ఇతరులకు తొందరగా వ్యాప్తి చెందే అవకాశాలు కూడా హైదరాబాద్‌లో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ విషయంలో ప్రత్యేక వ్యూహాన్ని అవలంబించాలి. నగరంలోని మొత్తం 17 సర్కిళ్లను 17 యూనిట్లుగా విభజించాలి. ప్రతీ యూనిట్‌కు ప్రత్యేకంగా వైద్యాధికారిని, పోలీసు అధికారిని, మున్సిపల్ అధికారిని, రెవెన్యూ అధికారిని నియమించాలి. మున్సిపల్ యంత్రాంగమంతా కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో నిమగ్నం కావాలి. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికంతా ఒకే జిల్లా వైద్యాధికారి ఉన్నారు. 17 సర్కిళ్లకూ వేర్వేరుగా సీనియర్ వైద్యాధికారులను నియమించాలి’’ అని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలోనూ, సరిహద్దు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్యశాఖ అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉండాలని నొక్కిచెప్పారు. పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో అన్ని లేబొరేటరీలను, ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు తెలిపారు. రోజుకు వెయ్యి నుంచి 11 వందల మందికి పరీక్షలు నిర్వహించే విధంగా, ఎన్ని కేసులొచ్చినా వైద్యం అందించే విధంగా వ్యవస్థను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

‘‘పాజిటివ్ కేసులను విశ్లేషించిన తర్వాత రాష్ట్రం మొత్తం 246 కంటైన్‌మెంట్‌లు ఏర్పాటైతే అందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 126 ఉన్నాయి. వీటి విషయంలో మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ క్లస్టర్‌లలోని ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానీయవద్దు. బయట వారిని లోపటికి పోనీయవద్దు. ప్రతీ కంటైన్‌మెంట్‌కు ప్రత్యేక పోలీసు అధికారిని, నోడల్ అధికారిని నియమించాలి. వారి ఆధ్వర్యలో నియంత్రణను కట్టుదిట్టం చేయాలి. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులను ప్రభుత్వ యంత్రాంగమే అందించాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

అత్యధిక జనసమ్మర్థం ఉండే జిహెచ్ఎంసిలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించాలని ముఖ్యమంత్రి అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ఇతర సీనియర్ అధికారులు ప్రతీ రోజు ఉదయం ప్రగతి భవన్‌లోనే జిహెచ్ఎంసిలోని సర్కిళ్ల వారీగా ప్రత్యేక సమీక్ష జరపాలని, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఇండ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి మరోసారి విజ్ఞప్తి చేశారు.

Tags: Telangana, Corona, CM KCR, pragathi Bhavan, Review, GHMC, Containment Clusters, DMHO

Next Story

Most Viewed