ఎన్నార్సీ, సీఏఏలపై సీఎం కేసీఆర్ తీర్మానం

by  |
ఎన్నార్సీ, సీఏఏలపై సీఎం కేసీఆర్ తీర్మానం
X

దేశవ్యాప్తంగా ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సి, సీఏఏలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అన్ని పార్టీల సభ్యులు దీనిపై లోతుగా చర్చించిన తర్వాత వారి నుంచి వెల్లడైన అభిప్రాయాల మేరకు అసెంబ్లీలోనే తీర్మానం జరగనుంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు చొరవ తీసుకోనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగిన బిఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో ముఖ్యమంత్రే ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధమని బహిరంగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేయడానికి చొరవ తీసుకోవడం గమనార్హం. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలూ సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి. ఎన్‌ఆర్‌సి విషయంలో సైతం టీఆర్ఎస్ సహా పార్టీలన్నీ వ్యతిరేకించాలన్న ఏకాభిప్రాయంతో ఉన్నాయి.

రాష్ట్ర బడ్జెట్‌పై రెండు రోజుల చర్చ :

బడ్జెట్ సమావేశాలు పన్నెండు రోజుల పాటు జరుగుతున్నప్పటికీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రెండు రోజుల పాటు చర్చ జరగనుంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఒక రోజు చర్చ జరగనుండగా బడ్జెట్‌పై మాత్రం రెండు రోజుల పాటు ఈ నెల 11, 12 తేదీల్లో చర్చ జరగనుంది. ఆ తర్వాత 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు (15న సెలవుదినం) ఆరు రోజుల పాటు వివిధ శాఖలకు సంబంధించిన డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ జరగనుంది. చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. సభ ఆమోదంతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. అయితే రాష్ట్రంలోని పలు ముఖ్య అంశాలపై ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి లఘు చర్చలు జరపాలని ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు బీఏసీ సమావేశంలో చర్చను లేవనెత్తారు. ఆ అంశాల ప్రాధాన్యతను బట్టి స్పీకర్ తగిన నిర్ణయం తీసుకునేలా సమావేశంలో నిర్ణయం జరిగింది.

శాసనసభ మొత్తం పన్నెండు రోజులు సమావేశాలు నిర్వహిస్తుండగా శాసనమండలి మాత్రం ఎనిమిది రోజులు మాత్రమే పనిచేయనుంది.

tags : Telangana, Assembly, Budget Session, NRC, NPR, CAA, CM KCR, Resolution, Debate


Next Story

Most Viewed