పక్కా ప్లాన్.. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత బాదుడే బాదుడు

by  |
cm-kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో: అధికార పార్టీకి హుజూరాబాద్ ఉపఎన్నిక కొరకరాని కొయ్యగా తయారైంది. గెలుపు కోసం దళితబంధు లాంటి భారీ పథకాన్ని ప్రకటించింది. కానీ దానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం సవాలుగా మారింది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలను పెంచితే సామాన్యుల్లో వ్యతిరేకత వస్తుంది. అది హుజూరాబాద్‌లో ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుంది. పెంచకుంటే ఆ నియోజకవర్గానికి దళితబంధుతో సహా పలు సంక్షేమ పథకాలకు డబ్బులను సర్దుబాటు చేయడం కష్టమవుతుంది. ఏం చేద్దామన్నా హుజూరాబాద్ ఉపఎన్నిక ముళ్ళ బాటలాగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి నుయ్యి.. గొయ్యిలాగా మారింది. హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసేంత వరకు విద్యుత్ ఛార్జీల పెంపుపైనా, ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడంపైనా నిర్ణయం తీసుకోరాదనే ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

ఇప్పటికే వివిధ పథకాల నుంచి డబ్బులను దళితబంధు కోసం మళ్ళించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నుంచి భారీ స్థాయిలో అప్పులు చేయాల్సి వస్తున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా ప్రతీ నెలా ఒకటవ తేదీన జీతాలిచ్చే సంప్రదాయం అటకెక్కింది. జిల్లాలవారీగా పంపిణీ చేయాల్సి వస్తున్నది. వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛన్లు లేట్ అవుతున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపు సమస్యాత్మకంగా మారింది. టీచర్లకు, ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఎప్పుడు పడతాయో తెలియని గందరగోళం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులను సమకూర్చుకోడానికి ఆర్టీసీ బస్సు ఛార్జీలను, విద్యుత్ ఛార్జీలను పెంచక తప్పని అనివార్య పరిస్థితి నెలకొన్నది.

ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ప్రైవేటు ఉద్యోగులకు జీతంలో కోత లాంటి ఇబ్బందులు వెంటాడుతున్న సమయంలో విద్యుత్, ఆర్టీసీ బస్సు ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచితే అది మూలిగే నక్క చందంగా ఉంటుందని, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అధికార పార్టీ నాయకుల భావన. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చని దాట వేసినట్లు తెలిసింది.

ఛార్జీల పెంపు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. అది సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పెట్టి ఏకగ్రీవ ఆమోదం పొందడం ద్వారా విపక్షాలను కూడా ఈ విషయంలో బాధ్యుల్ని చేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏం చేసినా హుజూరాబాద్ ఓటింగ్ మీద ఛార్జీల ప్రభావం పడకుండా ఉపఎన్నిక పూర్తయిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.


Next Story