వారిపై కేసీఆర్‌లో బలపడిన అనుమానాలు

by  |
వారిపై కేసీఆర్‌లో బలపడిన అనుమానాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రగతిభవన్​ వర్గాలపై సీఎం కేసీఆర్​కు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అధికారిక నివాసం నుంచి పక్కాగా లీకులు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. రహస్యంగా దాచాలనుకున్న విషయాలన్నీ బహిర్గతమవుతున్నట్లు సీఎం అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్​కు సంబంధించిన అంతర్గత విషయాలన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయి. అసలు దాచిపెట్టిన రహస్యాలు ఎలా లీక్​ అయ్యాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు నీటిపారుదల ప్రాజెక్టులపై అటు కేంద్రంతో పాటు జలశక్తి, కేఈఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ వివరాలు అడుగుతూనే ఉంది. డీపీఆర్​లు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూనే ఉంది. కేంద్రం కూడా దీనిపై చాలాసార్లు సీఎంకు అధికారికంగా లేఖలు పంపింది. అపెక్స్​ కౌన్సిల్​ భేటీలో కూడా డీపీఆర్​లు ఇవ్వాలని పేర్కొంది. కానీ రాష్ట్రం నుంచి మాత్రం డీపీఆర్​లు సమర్పించడం లేదు. అవసరమైతే అవన్నీ పాత ప్రాజెక్టులంటూ కొట్టిపారేస్తుందే కానీ డీపీఆర్​లు మాత్రం సమర్పించలేదు. ఒకదశలో డీపీఆర్​లు ఇవ్వమంటూ తెగేసి చెప్పింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైన్​గా చెప్పుకుంది. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలయ్యాయంటూ మెలిక పెట్టింది. ఇలా ప్రతి ప్రాజెక్టు డీపీఆర్​లను దాచి పెట్టుతూనే ఉంది. కొద్ది రోజుల కిందట వరకు డీపీఆర్​లు బయటకు వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం ధీమాతోనే ఉంది.

కాగా డీపీఆర్​లు ఇస్తే చాలా అంశాలు బహిర్గతమవుతాయి. ప్రాజెక్టుల అంచనాల నుంచి బిల్లుల చెల్లింపుల వరకు ప్రతి ఒక్కటీ వివరించాల్సిందే. అందుకే ప్రభుత్వాలు ప్రాజెక్టుల డీపీఆర్​లను దాచి పెడుతూ ఉంటాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక డీపీఆర్​ బయటకు ఇస్తేనే చాలా సమస్యలు వచ్చయి. అది కచ్చితమైన డీపీఆర్​ కాదంటూ ఆరోపణలు వచ్చాయి. అది అసలు డీపీఆర్​ కాదని ప్రభుత్వం నుంచే చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. రాష్ట్ర బడ్జెట్​తో పాటు నిధులన్నీ సాగునీటి ప్రాజెక్టులకే వెచ్చిస్తున్నారు. దీంతో డీపీఆర్​లను రాష్ట్ర ప్రభుత్వం బయటకు ఇవ్వడం లేదు.

ఇప్పుడెలా మరి..?

వాస్తవంగా కేంద్రం పదే పదే లేఖలు రాసింది. డీపీఆర్​ ఇవ్వాలంటూ పట్టుబట్టింది. కాళేశ్వరం థర్డ్​ టీఎంసీపై వివరాలు లేవంటూనే సమగ్రమైన నివేదికలు ఇవ్వాలని పేర్కొంది. అయితే మూడో టీఎంసీ నిర్మాణ పనులు దాదాపు 6‌‌0 శాతం పూర్తయినట్లు తెలుస్తుందంటూ కేంద్రం గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తూ లేఖ పంపింది. కానీ ప్రభుత్వం నుంచి సమాధానం ఇవ్వలేదు. దీంతో కాళేశ్వరం డీపీఆర్​లు కేంద్రం దగ్గర ఉన్నట్టుగా అనుమానాలు ఉన్నాయి. కానీ కేంద్రం నుంచి రాసిన తాజా లేఖతో కాళేశ్వరం డీపీఆర్​ మొత్తం కేంద్రం చేతుల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కాళేశ్వరంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్​లను కేంద్రం చేతుల్లో పెట్టుకుందని తెలుస్తోంది. గతంలో బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ కూడా ఈ వివరాలన్నీ కేంంద్రానికి సమర్పించినట్లు గుసగుసలు వినిపించాయి.

ప్రస్తుతం ప్రాజెక్టుల డీపీఆర్​లు కేంద్రం దగ్గర ఉన్నాయని అటు బీజేపీ, ఇటు టీఆర్​ఎస్​ నేతలు చెప్పుతున్నారు. ప్రభుత్వం రహస్యంగా దాచిపెట్టిన డీపీఆర్​లు కేంద్రం చేతికి చిక్కాయి. దీనిలో చాలా లోపాలు, అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైస్​ ఎస్కలేషన్​తో పాటు ఇసుక దందా, నిర్మాణాల్లో వైఫల్యాల వంటి అంశాలన్నీ కేంద్రం గుర్తించినట్లు చెప్పుతున్నారు. ఇవన్నీ డీపీఆర్​లు కేంద్రం చేతికి చిక్కడంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని భావిస్తున్నారు. తాజాగా కేంద్ర మంతి గజేంద్ర షెకావత్​… సీఎం కేసీఆర్​కు రాసిన లేఖలో చాలా అంశాలు వెల్లడించారు. దీని ప్రకారం కూడా డీపీఆర్​లు కేంద్రం దగ్గర ఉన్నట్లు స్పష్టమవుతోంది. చాలా విషయాలను పాయింట్​ టూ పాయింట్​ అడిగిన తీరును చూస్తే అదే వెల్లడవుతోంది.

బయటకు ఇచ్చెందెవ్వరు..?

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం… సీఎం కేసీఆర్​ ప్రగతి భవన్​ వర్గాలపై అనుమానాలు మొదలయ్యాయి. తన దగ్గరే ఉంటూ నమ్మక ద్రోహానికి పాల్పడిందెవ్వరనే అంశంపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు. వాస్తవంగా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న ప్రాజెక్టుల డీపీఆర్​లు కేంద్రానికి ఎలా చిక్కాయనేది అంతు చిక్కని అంశమే. ప్రగతి భవన్​కు ఎవరైనా వెళ్లడమే అత్యంత కష్టం. అలాంటిది ప్రగతి భవన్​లో దాచి పెట్టుకున్న డీపీఆర్​లు ఇప్పుడు కేంద్రానికి వెళ్లాయి. అంతేకాకుండా చాలా సెక్యూరిటీ అంశాలను దాటుకుని ఈ డీపీఆర్​లు బయటకు వెళ్లాయి. అది కూడా కేంద్రంతో కొంత వివాదం మొదలైన నేపథ్యంలోనే డీపీఆర్​లను చేతుల్లో పెట్టుకున్నారు. కేంద్రం ప్రాజెక్టుల డీపీఆర్​లను చేతుల్లో పెట్టుకుందని సీఎం కేసీఆర్​కు కూడా బలమైన అనుమానాలు ఉన్నాయి. దీనిపై కేంద్రం ఏదోవిధంగా చర్యలు తీసుకునేందుకు పూనుకుంటుందని కూడా అనుమానిస్తున్నారు. అయితే చాలా బలమైన వ్యవస్థను దాటుకుని డీపీఆర్​లు ఎలా వెళ్లాయో ఇంకా తేలడం లేదు. అయితే చాలా మేరకు కొంతమంది ఉన్నతాధికారులను అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మన దగ్గరి వారేనా..!

ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ టీం ఉంటోంది. సీనియర్​ ఐఏఎస్​లు, ముందు నుంచీ తనకు అండగా నిలిచిన అధికారులకు ప్రగతిభవన్​లో స్థానం కల్పించారు. కొంతమంది సెంట్రల్​ సర్వీసుల్లో ఉన్నా వారిని డిప్యూటేషన్​పైనో, అక్కడ రాజీనామా చేయించో ప్రత్యేకమైన పద్దతుల్లో వారిని కొనసాగిస్తున్నారు. అయితే ఇంత నమ్మకంగా ఉన్నా డీపీఆర్​ల విషయంలో నమ్మకద్రోహం చేసి కేంద్రానికి సహాకరించిదెవ్వరనే అంశం ఇంకా తేలడం లేదు. ఇది సీఎంకు కూడా తలనొప్పి వ్యవహారమే. అయితే కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన​ అధికారులపైనే కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో ఒకరిద్దరు సీనియర్​ అధికారులపై అనుమానాలు ఉండటంతో… కొద్దిరోజులుగా వారిని కీలక అంశాల్లో దూరంగా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన ఓ అధికారిపై రాష్ట్ర అధికారులు కూడా ఫిర్యాదులు చేశారు. కొన్ని సందర్భాల్లో ప్రగతిభవన్​లో సీఎం తరహాలో పెత్తనం సాగిస్తున్నారంటూ విమర్శలు చేశారు. అయితే కేంద్రంతో ఇంకా సత్సంబంధాలు ఉండటంతో ప్రాజెక్టుల డీపీఆర్​లన్నీ ఆయన ద్వారానే కేంద్రానికి వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. ఈ అంశం సీఎం కేసీఆర్​కు కూడా చేరడంతో… కొంతకాలంగా సదరు అధికారిపై కస్సుబుస్సులాడుతున్నారని సమాచారం. అయితే ఇంకా క్లారిటీ రాకపోవడంతోనే సీఎం వేచి చూస్తున్నట్లు అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. కానీ అత్యంత రహస్యంగా ఉంచి, డిజిటిల్​ కీలతో దాచి పెట్టుతున్న ఈ డీపీఆర్​లు కేంద్రానికి వెళ్లడం సీఎం కేసీఆర్​కు అగ్ని పరీక్షే. ఈ అంశంపై ప్రగతిభవన్​లో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాల్సిందేనంటున్నారు.

Next Story

Most Viewed