అనాలోచిత హామీలకే కేసీఆర్ జిల్లాల పర్యటన : విజయశాంతి

by  |
Vijayashanti Facebook
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసలు అమలు కాని, అమలు చేయని అవకతవక, అనాలోచిత హామీలు ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్నాడని బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. సోమవారం సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ తీరుపై మండి పడ్డారు.

కేసీఆర్ మళ్లా కరోనాకు పారాసిటమల్ చాలంటున్రు… జయశంకర్ వర్ధంతిని జయంతి అంటున్రు.. ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్ధం కావడం లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి… 3 ఎకరాల భూమి ఊసెత్తకుండా… ఇప్పుడు దళిత సాధికారత అని కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. డల్లాస్, చికాగో, న్యూయార్క్, ఇస్తాంబుల్ వాగ్దానాల యాది మరిచి, ఇప్పుడు కొత్తగా కెనడా హాస్పిటల్ అంటుండని ఆరోపించారు.

వీటిలో ఏ ఒక్కటీ ఇంతకుముందు జరగలేదని, ధనిక రాష్ట్రం అని చెప్తున్న ఈ సీఎం… మరి పైసలున్నప్పుడు గవన్నీ ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించారు. చేసేది ఇష్టం లేకనా… కాదంటే నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నట్లా?… వరంగల్ ఐటీ హబ్ అన్నారని, డబుల్ బెడ్రూం ఇళ్లన్నరు… కుర్చీ వేసుకు కూర్చుని పూర్తి చేసి కల్లు తాగి దావత్ చేసుకుంటానన్నరు… ఇవన్నీ ఏమైనవో తెలియదన్నారు. ఇప్పుడు మల్లా తుగ్లక్ తీరున ఈ వాగ్దానాలు చేస్తుండగా, తెలంగాణ ప్రజలు అమాయకులనా…? లేక ఈ సీఎం మానసిక పరిస్థితి సరిలేక ఇదంతా జరుగుతున్నదా?.. అని ప్రజలకు అనుమానాలు వస్తున్నాయన్నారు. వారి ఆలోచన సమతుల్యతను సందేహించాల్సినట్లుందనే అభిప్రాయాలు తెలంగాణ సమాజంలో బలపడుతున్నాయని విజయశాంతి అన్నారు.

Next Story

Most Viewed