టార్గెట్ ఈటల.. ఇప్పటినుంచే సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్

by  |
టార్గెట్ ఈటల.. ఇప్పటినుంచే సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈటల రాజేందర్ ను టార్గెట్ చేసుకొని అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలను ఓడించేందుకు నేతలను ఇప్పటినుంచే సన్నద్ధం చేస్తోంది. కుల, సామాజిక వర్గాల ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారికి పదవులు కట్టబెడుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నేతలకు కార్పొరేషన్ పదవులు అప్పగించగా… తాజాగా మరో ఎమ్మెల్సీ పదవిని అప్పగించింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలోతమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదువుతున్నారు. అన్ని వర్గాలను ఏకం చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగానే వకుళాభరణం కృష్ణమోహన్ కు బీసీ కార్పొరేషన్, బండా శ్రీనివాస్ కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అవకాశం కల్పించారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగా.. ఉప ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆయనకే పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించింది. అంతేగాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన వెంకట్రామిరెడ్డికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాపై కూడా ఈటలకు పట్టుండటంతో ఆ జిల్లాకు సైతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవుల్లో పెద్దపీట వేశారు. తక్కళ్లపల్లి రవీందర్ రావు, కడియం శ్రీహరి, బండా ప్రకాష్ లకు అవకాశం కల్పించారు. ఈటలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలనే లక్ష్యంతోనే ఏకంగా ఐదుగురికి అవకాశం కల్పించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

ముదిరాజ్ కు అనూహ్యంగా ఎమ్మెల్సీ

ఈటల ముదిరాజ్ కులానికి చెందిన బలమైన నేత. ఓటు బ్యాంకు ను కాపాడుకోవడంలో దిట్ట. అయితే వివిధ పార్టీల్లో ఉన్న నేతలను సైతం తనవైపుకు తిప్పుకునేందుకు యత్నాలు ప్రారంభించారు. రాబోయే ఎన్నికల్లో మరికొన్ని శాసనసభా స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే దానిని అడ్డుకోవడంతో పాటు ముదిరాజ్ లను టీఆర్ఎస్ వైపుకు తిప్పుకునేందుకు అనూహ్యంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న బండా ప్రకాశ్ తో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి నామినేషన్ వేయించారు. అతడి పదవీకాలం 2023 వరకు ఉంది. అయినప్పటికీ శాసన మండలికి తీసుకొని కేబినెట్ లో మంత్రి పదవి అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. మంత్రితో ముదిరాజ్ కులస్తుల్లో టీఆర్ఎస్ అండగా ఉంటుందనే భావన కలిగించి పార్టీ వైపుకు నేతలను, ప్రజలను తిప్పుకునే యత్నం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదీ ఏమైనప్పటికీ ఈటల టీఆర్ఎస్ పార్టీని వీడడంతో ఆ పార్టీ నేతలకు పదవులు వరిస్తున్నాయనడంతో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఈటల టార్గెట్ గా రాజకీయ పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి.



Next Story