క్యాష్ కన్నా క్యారెక్టర్ గొప్పదని మా కౌన్సిలర్లు నిరూపించారు.. ఎంపీ కేశినేని నాని

by  |
nani
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రెండో రోజు కూడా వాయిదా పడటంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ ఎన్నిక జరగకుండా వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. హాజరు తీసుకోమని ఆర్వో ఆదేశించగానే.. బల్లలు విరగ్గొట్టడం ప్రారంభించారని ధ్వజమెత్తారు. కోర్టు ఆదేశాలతో జరిగే ఎన్నిక అయినా.. అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. వైసీపీ కౌన్సిలర్లు రెండు రోజులుగా మున్సిపల్ కార్యాలయంలో అరాచకం, హడావుడి చేశారన్నారు.

ఎన్నికల అధికారి సరైన వివరణ ఇవ్వకుండా ఎన్నిక వాయిదా వేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పుకొచ్చారు. బుధవారం ఉదయం 10.30గంటలకు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు ఆదేశించిందని స్పష్టం చేశారు. టీడీపీ సభ్యులకు పోలీసులు పూర్తి భద్రత కల్పించాలి అని హైకోర్టు సూచించిందని వెల్లడించారు. కనీసం బుధవారం అయినా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతతో ఎన్నికలు నిర్వహిస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

వైసీపీ సభ్యుల తీరుపై ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎంపీ కేశినేని నాని సూచించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా సభ్యులు ధైర్యంగా నిలబడ్డారు. క్యాష్ కన్నా క్యారెక్టర్ ముఖ్యమని నిలబడిన టీడీపీ కౌన్సిలర్లకు ఎంపీ కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు.



Next Story