ఆమె.. చనిపోయిన వ్యక్తి బట్టలు అమ్ముతోంది!

by  |
ఆమె.. చనిపోయిన వ్యక్తి బట్టలు అమ్ముతోంది!
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు.. పోయేటప్పుడు ఏం పట్టుకుపోం’ అనే మాటను సందర్భాన్ని బట్టి అందరూ వాడుతుంటారు. అందులో వాస్తవమున్నా మనం అంగీకరించలేం. అయితే, ఇదే సూత్రంతో ఓ సేల్స్‌వుమెన్ కొత్త బిజినెస్‌కు శ్రీకారం చుట్టడం విశేషం. సాధారణంగా చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులను మనం గుర్తుగా ఉంచుకుంటాం లేదా వాటిని చూస్తే చనిపోయిన వ్యక్తి పదే పదే గుర్తుకొచ్చి బాధపడతామని దానం చేస్తుంటాం. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయాన్ని పాటించడం పరిపాటి. అలానే థాయ్‌లాండ్‌లో ఎవరైనా చనిపోతే మాత్రం వారికి సంబంధించిన బట్టలన్నింటినీ వారితో పాటే తగలబెట్టేస్తారు. అలా కాకుండా.. వాటిని అవసరమైన వారికి అమ్మాలని భావించింది 32 ఏళ్ల కనితా థాంగ్ ‌నాక్. అందుకోసం ఆమె ఏం చేస్తోంది? ఎలా వాటిని అమ్ముతోంది?

కనితా థాంగ్‌నాక్ ఫేస్‌బుక్ లైవ్‌స్ట్రీమ్‌కు వెళ్తే.. ఒక్కసారిగా మనం భయపడిపోతాం. ఎందుకంటే ఆమె జాంబీ మేకప్‌(లివింగ్ డెడ్)తో ఆ లైవ్ స్ట్రీమ్ చేస్తుంటుంది. ఎందుకలా అంటే.. చనిపోయిన వ్యక్తి బట్టలు అమ్మితే ఎవరు కొనుక్కుంటారు. మొదట అది జనాల్లోకి పోవాలంటే.. ఏదో కొత్తగా ప్రయత్నించాలి. ప్రజల అటెన్షన్‌ను గ్రాస్ప్ చేయాలి. కనితా కూడా అదే చేసి సక్సెస్ అయ్యింది. చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బట్టలు అమ్మడమే ఆమె వ్యాపారం. అయితే, ప్రతీ వ్యక్తి చావుకు ఓ కారణంతో పాటు ఓ కథ ఉంటుంది. అదే స్టోరీని తన లైవ్‌స్ట్రీమ్‌లో జాంబి మేకప్‌లో ఉండి చెబుతోంది. దాంతో నెటిజన్లు ఆమె చేసే పనికి ఆకర్షితులవుతున్నారు.

కనితా ఒకరి అంత్యక్రియలకు హాజరైనప్పుడు.. ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బట్టలన్నిటినీ కాల్చేయడం గమనించింది. వేల రూపాయల బట్టలను అలా బూడిద చేయడం తనకు నచ్చలేదు. ఆ బట్టలను అవసరమైన వారికి తక్కువ రేట్లకే అమ్మితే బాగుంటుందనే ఆలోచన రాగానే.. లోకల్ టెంపుల్‌కు వెళ్లింది. అక్కడి మాంక్‌తో మాట్లాడి, తన ఆలోచన చెప్పగానే.. తను కూడా ఒప్పుకున్నాడు. అలా చనిపోయిన వ్యక్తికి సంబంధిచిన క్లాత్స్‌ను ఆమె సేకరిస్తోంది. ఒక్కో క్లాత్ రేంజ్ 10-100 బాత్ (రూ. 23-237). అందులో బ్రాండెడ్ క్లాత్స్‌తో పాటు డిజైనర్ వేర్స్ కూడా ఉంటాయి. ఇలా తను అమ్మగా వచ్చిన డబ్బుల్లో కొంత మొత్తాన్ని ఆ టెంపుల్‌కు విరాళంగా ఇస్తోంది. ఈ వ్యాపారంతో పాటు తను హ్యాండ్‌మేడ్ జాంబీ డాల్స్ కూడా అమ్ముతోంది.



Next Story

Most Viewed