ఆ 100మంది ఎక్కడ..?

by  |
ఆ 100మంది ఎక్కడ..?
X

హైదరాబాద్: ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్ బారిన పడి భారత్‌లో ఇప్పటికే రెండు మరణాలు సంభవించాయి. వీరిలో ఒకరు కర్నాటకలోని కల్బుర్గికి చెందిన 76ఏండ్ల వృద్ధుడు కాగా, మరొకరు దేశరాజధాని ఢిల్లీకి చెందిన 69ఏండ్ల వృద్ధురాలు. అయితే, తొలి కరోనా మృతుడైన వృద్ధుడు.. ఈ మహమ్మారి లక్షణాలు కపించినప్పట్నుంచీ దాదాపు వంద మందిని కలిసినట్టు ఆస్పత్రి వర్గాలు అనుమానిస్తున్నాయి.
జనవరి 29న సౌదీ అరేబియాకు వెళ్లిన ఆయన ఫిబ్రవరి 29న హైదరాబాద్‌ వచ్చారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించగా.. అతడిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. దీంతో ఆయన పాతబస్తీలోని బంధువుల ఇంట్లో కొద్దిరోజులు గడిపారు. అనంతరం తిరిగి కర్నాటకకు వెళ్ళిపోయాడు. దగ్గు, జ్వరం తీవ్రమవ్వడంతో ఈ నెల 9న కర్నాటకలోని ప్రైవేటు హాస్పిటల్‌లో చేర్పించగా, ఐసోలేషన్ వార్డులో ఉంచాలని వైద్యులు తెలిపారు. దీనికి నిరాకరించిన బంధువులు.. వైద్యులకు తెలియకుండా రోగిని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక్కడా దగ్గు, జ్వరం ఏ మాత్రం తగ్గకపోవడంతో తిరిగి కర్ణాటకకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అతను చనిపోయే సమయానికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ కాలేదు. అనంతరం వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా రోగి కరోనా కారణంగానే మరణించాడని కర్నాటక వైద్యులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని వైద్యులు, నర్సులు సహా దాదాపు 100మంది రోగితో నేరుగా కాంటాక్ట్ అయ్యారని ఇరు రాష్ట్రాల వైద్యాధికారులు చెబుతున్నారు. వీరిలో శుక్రవారం రాత్రి నాటికి 34మందిని అదుపులోకి తీసుకున్నామని వైద్యాధికారులు వెల్లడించారు. వీరందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచినట్టు తెలిపారు. అయితే, మిగతా 66మంది ఎవరేనేది తెలియాల్సి ఉంది. రోగిని కలిసిన వాళ్లు హైదరాబాద్‌లోనే ఉండటంతో నగరవాసులంతా భయాందోళనలకు గురవుతున్నారు.

Tags: carona, covid-19, kalaburagi, 1st carona death, india, apollo

Next Story

Most Viewed