భారత ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి కె.వి.సుబ్రమణియన్ రాజీనామా!

by  |
K V Subramanian
X

దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ), ప్రొఫెసర్ కె.వి.సుబ్రమణియన్ శుక్రవారం తన సీఈఏ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన మూడేళ్ల పదవీకాలం పూర్తయిందని, ఇకమీదట విద్యాసంస్థలో తిరిగి కొనసాగనున్నట్టు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ హైదరాబాద్‌)లో ప్రొఫెసర్‌గా ఉన్న సుబ్రమణియన్‌ను ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో సీఈఏగా నియమించింది. అంతకుముందు ఉన్న అరవింద్ సుబ్రమణ్యం తర్వాత కె.వి.సుబ్రమణియన్ ఆ బాధ్యతలను చేపట్టారు. 2019లో ప్రొఫెసర్ ఆఫ్ ది ఇయర్‌గా అవార్డును పొందారు.

అంతకుముందు మార్కెట్ల నియంత్రణ బోర్డు సెబీలోనూ, ఆర్‌బీఐ నిపుణుల కమిటీలోనూ భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నారు. కె.వి.సుబ్రమణియన్ కలకత్తాలోని ఐఐటీ కాంపూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యూనివర్శిటీ నుంచి ఫైనాన్షియల్ ఎకనమిక్స్‌లో ఎంబీఏ, పీహెచ్‌డీ చేశారు. మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పర్యవేక్షణలో పీహెచ్‌డీని పూర్తి చేశారు. తన పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు కె.వి.సుబ్రమణియన్ కృతజ్ఞతలు చెప్పారు.

Next Story