కరోనాతో హైకోర్టు జడ్జీ కన్నుమూత

by  |
కరోనాతో హైకోర్టు జడ్జీ కన్నుమూత
X

అహ్మదాబాద్: గుజరాత్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ ఉధ్వాని(59) శనివారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. నవంబర్ 19న కరోనా బారిన పడ్డ జస్టిస్ ఉధ్వాని.. 22న అహ్మదాబాద్‌లోని ఎస్ఏఎల్ హాస్పిటల్‌లో చేరారు. ఊపిరితిత్తుల సమస్యతో హాస్పిటల్‌లో ఆయన చేరారని, ఆయనకు హైపోథైరాయిడిజం ఉన్నదని డాక్టర్ దివ్యాంగ్ దల్వాడి తెలిపారు. కరోనా చికిత్స పొందుతున్న ఆయనకు శనివారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చిందని, 7.40 గంటలకు మరణించారని వివరించారు.

చికిత్సలో భాగంగా ఉధ్వానికి రెమెడెసివిర్, టొసిలిజుమాబ్ ఔషధాల నివ్వడంతోపాటు ప్లాస్మా థెరపీ కూడా చేశామని తెలిపారు. ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 3 నుంచి ఆక్సిజన్ సపోర్ట్ పైనే ఉంచామని వివరించారు. జస్టిస్ జీఆర్ ఉధ్వాని 1987లో లీగల్ ప్రొఫెషన్‌లోకి ప్రవేశించారు. 2011 నుంచి 2012 వరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా సేవలందించారు. 2012 నవంబర్ 12న గుజరాత్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన 2014 జులై 10న శాశ్వత న్యాయమూర్తిగా నియామితులయ్యారు.


Next Story

Most Viewed