సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 75 వేల కోట్లు

by  |
సామర్థ్యాన్ని పెంచేందుకు రూ. 75 వేల కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తన మొత్తం సామర్థ్యాన్ని 20 గిగావాట్లకు పెంచనున్నట్టు వెల్లడించింది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం రూ. 75 వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు శుక్రవారం తెలిపింది. ప్రధానంగా పునరుత్పాదక ఇంధన కోసం పెట్టుబడులు ఉండనున్నట్టు తెలుస్తోంది. అలాగే, 2023, జూన్ నాటికి సంస్థకు ప్రస్తుతం ఉన్న సామర్థ్యానికి 2.5 గిగావాట్లను చేర్చేందుకు కంపెనీ చర్యలు తీసుకుందని, కొత్త సామర్థ్యం కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సంస్థ సామర్థ్యాన్ని 20 గిగావాట్లకు పెంచేందుకు కంపెనీ బోర్డు ఆమోదించిందని, అందుకోసం కంపెనీ ఓ ప్రణాళికను రూపిందించినట్టు సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ప్రశాంత్ జైన్ అన్నారు.

ఇక, 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసే త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ రూ. 107 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ రూ. 108 కోట్ల లాభాలను నమోదు చేసింది. సమీక్షించిన త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ. 1,614 కోట్లుగా వెల్లడించింది. ఇంధన వ్యయం 30 శాతం తగ్గి రూ. 701 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంస్థ లాభం రూ. 795.48 కోట్లుగా ఉంది. ఆదాయం రూ. 7,159.65 కోట్లుగా ఎక్స్ఛెంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 2 డివిడెండ్‌కు సిఫార్సు చేసింది.

Next Story

Most Viewed