గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు లైన్ క్లియర్

by Disha Web Desk 2 |
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు లైన్ క్లియర్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈనెల 11న జరగనున్న పరీక్షను రద్దు చెయ్యాలంటూ కొందరు, వాయిదా వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఇంకొందరు దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేసిన విషయం తెలిసిందే. తిరిగి ఈనెల 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరపాలని నిర్ణయించిన బోర్డు ఈ మేరకు ఇటీవల ప్రకటన విడుదల చేసింది. దీనిపై 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసారు. తాము పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాని నేపథ్యంలో రెండు నెలలపాటు పరీక్షను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యాలని కోరారు.

దీనిపై విచారణ జరుగుతుండగానే మరికొందరు గ్రూప్-1 పరీక్షను రద్దు చెయ్యాలని హైకోర్టును ఆశ్రయించారు. పేపర్ లీక్ అయిన సమయంలో బోర్డులో ఉన్న ఉద్యోగులతో మళ్లీ పరీక్ష జరుపుతున్నారని, వీరిపై నమ్మకం లేదని పేర్కొన్నారు. కాగా, ప్రభుత్వం తరపు న్యాయవాది ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పరీక్ష జరుపటానికి బోర్డు అన్ని చర్యలు తీసుకుందని కోర్టుకు తెలిపారు. దీనితో ఏకీభవించిన కోర్టు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు, వాయిదా పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.


Next Story