ఐడియా, జియో, వోడాఫోన్ వినియోగదారులకు శుభవార్త

by  |
ఐడియా, జియో, వోడాఫోన్ వినియోగదారులకు శుభవార్త
X

దిశ వెబ్ డెస్క్: బీఎస్ఎన్ఎల్, ఎయిర్ టెల్ తరహాలోనే జియో కూడా తన జియో ఫోన్ వినియోగదారులకు లాక్ డౌన్ సమయంలో కొన్ని ఉచిత లాభాలను ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా కూడా తన సబ్‌స్క్రైబర్లకు తీపికబురు అందించింది. వినియోగదారులకు అవసరమైన సమయంలో ఆయా కంపెనీలు తమ ఉదారతను చాటుకుంటున్నాయి. జియో టెలికాం కంపెనీ దాని వినియోగదారులకు ఉచితంగా 100 నిమిషాలను, 100 ఎస్ఎంఎస్ లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఐడియా వోడాఫోన్లు.. ప్రిపెయిడ్ ప్లాన్ వాలిడిటీని పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్న అల్పాదాయ కస్టమర్లకు మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది.

ఎయిర్‌టెల్ ఇప్పటికే తన కస్టమర్లకు ప్రిపెయిడ్ వ్యాలిడిటిని పెంచడంతో పాటు, రూ.10 టాక్ టైమ్ ను అందించింది. 8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లకు ప్రయోజనం కలుగుతుందని ఎయిర్‌టెల్ తెలిపింది. అలాగే ప్రభుత్వ రంగ టెలికం కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూడా ఇలాంటి ఆఫర్లనే అందించాయి. ఏప్రిల్ 20 వరకు వాలిడిటీని పొడిగించాయి. రూ.10 ఉచిత టాక్‌టైమ్ ఆఫర్ చేశాయి. ప్రస్తుతం ఐడియా,వోడాఫోన్, జియోలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి.
ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్న అల్పాదాయ కస్టమర్లకు ప్రిపెయిడ్ రీచార్జ్ వాలిడిటీని పొడిగిస్తున్నామని వోడాఫోన్ ఐడియా తెలిపింది. ఏప్రిల్ 17 వరకు ఈ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొంది. దీంతో రీచార్జ్ ప్లాన్ వాలిడిటీ అయిపోయినా కూడా కస్టమర్లకు ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. సాధారణంగా ప్లాన్ వాలిడిటీ అయిపోతే ఇన్‌కమింగ్ కాల్స్ రావు. అంతేకాకుండా వీరికి రూ.10 ఉచిత టాక్‌టైమ్ ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ పరిస్థితుల్లో కస్టమర్లకు ఈ ఉచిత టాక్ టైమ్ అందిస్తున్నామని, వారు వారి కుటుంబ సభ్యులతో అనుసంధానమై ఉండొచ్చని కంపెనీ వివరించింది.

జియో కూడా:

జియోఫోన్ కూడా తన కస్టమర్లకు ఉచితంగా నిమిషాలు, 100 ఎస్ఎంఎస్ లను అందించింది. వీటి వ్యాలిడిటీ ఏప్రిల్ 17వ తేదీ వరకు ఉంది. పైన తెలిపినట్లే ప్రస్తుతం ఉపయోగించే ప్లాన్ వ్యాలిడిటీ అయిపోయాక కూడా ఉచితంగా ఇన్ కమింగ్ కాల్స్ లభిస్తాయి. ప్రస్తుతం రిటైల్ దుకాణాలు లేకపోవడంతో వినియోగదారులు యూపీఐ, ఏటీయం, ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్ ద్వారా రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని జియో కల్పించింది. వినియోగదారులు డిజిటల్ గా రీచార్జ్ చేసుకోవడానికి అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తున్నట్లు జియో ఈ సందర్భంగా తెలిపింది. దీనికోసం మైజియో యాప్ ను లాంచ్ చేసిన జియో.. ఆన్ లైన్ రీచార్జ్ చేసుకున్నవారికి క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అయితే ఇప్పటికీ ఆన్ లైన్ రీచార్జ్ ఎలా చేసుకోవాలో తెలియని వినియోగదారులు కొందరు ఉండవచ్చు. వారి కోసం జియో ప్రత్యేకంగా ఈ ఉచిత నిమిషాలను అందించనుంది. జియోఫోన్ రీచార్జ్ ల విషయానికి వస్తే.. జియో ఫోన్ ఆల్ ఇన్ వన్ ప్లాన్లు రూ.75 నుంచి ప్రారంభం అయి రూ.185 వరకు ఉన్నాయి. బేసిక్ రూ.75 ప్లాన్ తో 3 జీబీ డేటా, 500 నాన్ జియో నిమిషాలు లభిస్తాయి. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

Tags : jio, vodafone,idea, airtel,bsnl,prepaid,customers, validity,free talk time, minutes,sms,data


Next Story

Most Viewed