బీజేపీ గెలుపే కేసీఆర్‌కు చెంపపెట్టు : వివేక్

by  |
బీజేపీ గెలుపే కేసీఆర్‌కు చెంపపెట్టు : వివేక్
X

దిశ, సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ మరియు బీజేపీ మధ్య పోటీ తీవ్రస్థాయిలో నెలకొంది. దానికి అనుగుణంగానే ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. నిన్న సిద్ధిపేటలో బీజేపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడంపై కమలం పార్టీ సీనియర్ నాయకులు ఫైర్ అయ్యారు. రఘునందన్ రావు ఇంటితో పాటు బంధువుల ఇళ్లల్లో సిద్ధిపేట పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో తీవ్ర ఉద్రికత్త నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే, ఆ సమయంలో ఘటనా స్థలిలో లేని బీజేపీ కార్యకర్తలను కూడా కావాలనే పోలీసులు అరెస్ట్ చేశారని మాజీ ఎంపీలు వివేక్, జితేందర్ రెడ్డిలు అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు బీజేపీ నేతలు సిద్దిపేట వన్‌‌టౌన్ పీఎస్‌కు వచ్చి పార్టీ కార్యకర్తలను పరామర్శించారు.

మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలు డబ్బులు ఎత్తుకెళ్ళలేదని.. పోలీస్ వాళ్లే తెచ్చారని, అందరికీ తెలిసేలా మీడియాలో కనిపించేలా తమ కార్యకర్తలు చూపించారని చెప్పారు. అరెస్ట్ చేసిన కొంతమంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు దైర్యంగా ఉండి, రఘునందన్ రావు గెలుపు కోసం కృషి చేయాలన్నారు. మంత్రి హరీష్ రావుకు ఒడిపోతున్నామని అని తెలిసి ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని మండిపడ్డారు. ఇకమీదట హరీష్ రావు ఆటలు సాగనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ.. పోలీసులను కేసీఆర్, హరీష్‌రావులు అన్ని రకాలుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఘటనా ప్రదేశంలోని వీడియోలు చూస్తే పోలీసులే డబ్బులు తెచ్చినట్లు అర్థమవుతోందన్నారు. కేసీఆర్ అనేక రకాలుగా కుట్ర పన్నుతున్నాడని మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికలో బీజేపీ గెలుపు కేసీఆర్‌కు చెంపపెట్టు కావాలని వివేక్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Next Story