హక్కు లేదు.. చైనాకు తేల్చి చెప్పిన భారత్

by  |
హక్కు లేదు.. చైనాకు తేల్చి చెప్పిన భారత్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రపాలిత ప్రాంతాలు జమ్ము కశ్మీర్, లడాఖ్‌లు ఇది వరకు భారత్‌లో అంతర్భాగంగానే ఉన్నాయని, ఇకపైనా అలాగే ఉంటాయని భారత్ స్పష్టం చేసింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు చైనాకు లేదని తెలిపింది. లడాఖ్, అరుణాల్ ప్రదేశ్‌లను తాము గుర్తించడం లేదని చైనా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పందించారు.

ఈ విషయాల్లో భారత వైఖరి ఎల్లప్పుడు సుస్పష్టంగానే తెలియజేసిందని, అరుణాచల్ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమేనని అనేక సందర్భాల్లో చైనాకు తెలియజేశామని, ఆ దేశ ఉన్నతస్థాయి అధికారులకూ పలుసార్లు వివరించామని తెలిపారు. ఇతర దేశాలు ఆశించినట్టే భారత కూడా తమ అంతర్గత విషయాల్లో విదేశాలు జోక్యం చేసుకోవద్దని ఆశిస్తున్నదని అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా పనికి వచ్చే 44 వంతెనలను కేంద్ర రక్షణ మంత్రి ప్రారంభించిన తర్వాతి రోజు చైనా పై విధంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

యుద్ధ సన్నద్ధంపై దృష్టి పెట్టండి: ట్రూపులను ఆదేశించిన చైనా అధ్యక్షుడు

చైనా ట్రూపులు యుద్ధ సన్నద్ధతపై దృష్టి పెట్టాలని ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆదేశించినట్టు జిన్హువా రిపోర్ట్ చేసింది. సైన్యం అలర్ట్‌గా ఉండాలని, యుద్ధానికి సిద్ధమవ్వడానికి శక్తియుక్తులను పెట్టాలని ఆయన సూచించారు. చౌజావ్ పట్టణంలోని పీఎల్‌ఏకు చెందిన మెరైన్ కార్ప్స్‌ పర్యటనలో ఉన్న జిన్‌పింగ్ సైన్యం అన్ని విధాల దేశానికి సహకరించాలని అన్నారు. లడాఖ్‌లో ఉభయ దేశాల మధ్య ఘర్షణాయుత వాతావరణం నెలకొన్న సందర్భంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ అవి భారత్‌ను ఉద్దేశించి కాదని తెలుస్తున్నది. చైనా తన సార్వభౌమత్వంగా ప్రకటించుకున్న తైవాన్ స్ట్రెయిట్ నుంచి అమెరికా నావ వెళ్తున్న సందర్భంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed