ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక పాసుల జారీ

by  |
ఈ-పాస్ ద్వారానే ప్రత్యేక పాసుల జారీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రేపటి నుండి పది రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు జారీ చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అందజేసే ఈ- పాస్‌ల కోసం https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులను జారీ చేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లు మాత్రమే పాస్‌లను జారీ చేస్తారని తెలిపారు.

అయితే.. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుండే పాస్ లు జారీ చేస్తారని అన్నారు. హైదరాబాద్‌లో ఒక కమిషనరేట్ నుండి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమిషనరేట్ నుండే పాసులు జారీ చేస్తారని వివరించారు. లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం ఆరు గంటల నుండి 10 గంటలలోపు ప్రయాణించే వారికి ఏ విధమైన పాసులు అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్కడి నుండైనా పైన పేర్కొన్న వెబ్ సైట్ ద్వారానే ఈ-పాస్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.



Next Story

Most Viewed