మైనార్టీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం?

by  |
మైనార్టీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం?
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం మైనార్టీలో పడిందా? అధికార పార్టీ పీటీఐ నుంచి ఫిరాయింపులు జరిగాయా? కీలకమైన సెనేట్ ఎన్నికల్లో పీఎం సన్నిహితుడు, ఫైనాన్స్ మినిస్టర్ అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమిపాలవడంతో పీఎం ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని విపక్షాల నుంచి డిమాండ్‌లు పెరిగాయి. పీటీఐ నేతలు వాటిని కొట్టిపారేసే ప్రయత్నం చేసినా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 6న పార్లమెంటులో విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. పాకిస్తాన్ పార్లమెంటులోనూ ఎగువ(సెనేట్) దిగువ(నేషనల్ అసెంబ్లీ) సభలున్నాయి. సెనేట్‌ సభ్యులకు అసెంబ్లీ సభ్యులకన్నా ఎక్కువ అధికారాలుంటాయి. సెనేట్ సభ్యులకు జరిగిన ఎన్నికల్లో పీఎం ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు, ఆర్థిక శాఖ మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ పోటీ చేశారు. అబ్దుల్ హఫీజ్ షేక్‌ సులువుగా గెలుస్తారని, పీటీఐకి 182 సభ్యుల మద్దతు ఉన్నదని పార్టీ నేతలు చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలవడానికి 172 ఓట్లు చాలని వివరించారు.

కానీ, ఈ ఎన్నికల్లో ఐదు ఓట్ల తేడాతో షేక్‌(164)పై ప్రతిపక్ష నేత యూసుఫ్ రజా గిలానీ(169) గెలుపొందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ గురువారం మాట్లాడుతూ… ఈ నెల 6న దిగువ సభలో విశ్వాస పరీక్షకు సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు, ఒకవేళ ఆ పరీక్షలో ఓడినా ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. సెనేట్ ఎన్నికల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పోలింగ్ పారదర్శకంగా నిర్వహించలేకపోయిందని, ఎన్నికలను రహస్యంగా జరపాల్సింది కాదని అన్నారు. సెనేట్ ఎన్నికల్లో డబ్బు రాజ్యమేలుతోందని, గత 40 ఏళ్ల నుంచి ఇదే సాగుతున్నదని తెలిపారు. పార్టీ ఆదేశాలకు కట్టుబడని సొంత పార్టీ నేతలపై దర్యాప్తు చేపట్టలేక విశ్వాసపరీక్షను నిర్వహిస్తున్నారా? అంటూ పీఎంపై సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయితే, పీఎం తన ప్రసంగానికి ముందు పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖామర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌లతో భేటీ కావడం గమనార్హం.



Next Story

Most Viewed