Lock down : లాక్‌డౌన్‌లో పోలీసుల తీరు శృతి మించుతోందా..?

by  |
Karimnagar Police
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆత్మహత్య చేసుకున్న తన చెల్లెలి చివరి చూపు చూసేందుకు కరీంనగర్ చేరుకున్న వారిని వాలంటీర్లు అడ్డుకున్నారు. విషయం చెప్పినా వినకుండా అదుపులోకి తీసుకుని ఐసోలేషన్ కేంద్రానికి పంపించారు. కనీసం చెల్లెలు చనిపోయిందా లేదా అన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చివరి చూపునకు కూడా నోచుకోకపోయామన్న వేదనతో వారు మానసికంగా బాధపడ్డారు. రెండు రోజుల క్రితం ఓ ఎమ్మెల్సీకి చెందిన వాహనంలో వెళ్తున్న వారిని ఆపి మరీ ఎమ్మెల్సీ లేకుండా స్టిక్కర్ ఎలా ఉంది.. ఆయన లేకుండా ఎలా స్టిక్కర్ అంటించారు.. బండిని సీజ్ చేస్తానని ఓ పోలీసు అధికారి వార్నింగ్ ఇచ్చాడు. ఎమ్మెల్సీకి ఐదు వాహనాలకు స్టిక్కర్ వేసుకునే అవకాశం అసెంబ్లీ నిబంధనలే కల్పించాయి. అయినప్పటికీ పోలీసు అధికారి వాహనంలో ఉన్న వారిని హెచ్చరించడం విస్మయం కలిగించింది.

అయితే పోలీసు విభాగంలో పని చేస్తున్న వారు తమ వాహనాలకు పోలీస్ అని స్టిక్కరింగ్ చేసుకుని తిరుగుతుంటారని, అందులో పోలీసు విభాగంలో పనిచేసే వారు ప్రయణించనప్పుడు తీసేస్తారా అని ప్రశ్నిస్తున్నారు కొందరు. లాక్ డౌన్ వేళల్లో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చిన వారి అత్యవసరం ఏంటన్న విషయం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. మానవతా దృక్ఫథంతో వ్యవహరించాల్సిన సమయంలో కూడా పోలీసులు, వాలంటీర్లు నిబంధనల మూసుగేస్తూ కఠినంగా వ్యవహరించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యంగా మారినప్పటికీ పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దురుసుగా మాట్టాడుతూ, సామాన్యులపై లాక్ డౌన్ రూల్స్ అంటూ కట్టడి చేస్తున్న తీరుపై పోలీసు అధికారులు సమీక్షాంచాల్సిన అవసరం ఉంది. ఓ వైపున వృద్ధులను, గర్భిణీలను ఆదుకుని వారిని గమ్యస్థానాలకు చేరుస్తున్నామని చెప్పుకుంటున్న పోలీసు విభాగం సమీప బంధువులు చనిపోయినప్పుడు కూడా చివరి చూపును దక్కించుకునే అవకాశాన్ని కల్పించడంలో ఎందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంటి దొంగలెవరో..?

రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్నప్పటి నుండి కరీంనగర్ పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారన్న పేరు ఉంది. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేస్తు, వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు కేసులు నమోదు చేస్తున్నారు. అయితే పోలీసులు సీజ్ చేసిన వాహనాలు కొన్ని పోలీస్ హెడ్ క్వార్టర్ గోడలు దూకి మరీ రోడ్లపై తిరుగుతున్నాయని సమాచారం. ఇటీవల పోలీసులు పట్టుకున్న ఓ బైకును అప్పటికే రెండు సార్లు సీజ్ చేసినట్టు తెలిసింది. సీజ్ అయిన వాహనం డేగ కళ్ల నిఘా నడుమ ఉన్న హెడ్ క్వార్టర్స్ దాటి బయటకు ఎలా వచ్చిందన్నదే అంతుచిక్కకుండా పోయింది.

గంగాధరకు చెందిన ఓ వ్యక్తి కరీంనగర్ లోని ప్రైవేటు వ్యాపారి వద్ద పనిచేస్తున్నాడు. కష్టపడి పనిచేస్తే తప్ప కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి వ్యాపారి వద్ద విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అతని వాహనం సీజ్ చేశారు. 10 గంటలు దాటిందని లాక్ డౌన్ రూల్స్ అమలు చేశారు పోలీసులు. అయితే వ్యాపారి వద్ద పనిచేస్తున్న సదరు వ్యక్తి 10 గంటలకు షాప్ మూసేసిన తరువాత అందులో సామన్లు లోపలకు సర్ది రావాల్సిన బాధ్యత కూడా ఉండడంతో ఆలస్యంగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అయినా అతని గోడు వినిపించుకోకుండా బైక్ ను సీజ్ చేశారు. ఇలాంటి సంఘటనలకు పునరావృతం కాకుండా చూడాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు.

Next Story