కేసీఆర్.. బీజేపీకి భయపడుతున్నారా !

by  |
కేసీఆర్.. బీజేపీకి భయపడుతున్నారా !
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీని చూసి భయపడుతున్నారా అంటే అవుననే అంటున్నారు నిన్నటి గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో ప్రెస్‌మీట్‌ పరిశీలించిన వారు. బల్దియాపై వరాల వాన కురిపించి, ఒక్కసారిగా టాక్ ఛేంజ్ చేసిన సీఎం.. ఎక్కడా బీజేపీ పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేయడం అందులో భాగమేనంటున్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తర్వాత, కాషాయ పార్టీకి తగ్గిన కేసీఆర్.. అగ్గిమండే హైదరాబాద్, మత కల్లోలాలు, కత్తిపోట్ల లాంటి మాటలు మాట్లాడారని అభిప్రాయపడుతున్నారు. అంతేగాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, భూముల ధరలు పడిపోతాయని ప్రస్తావించండం కేసీఆర్ ఓ మెట్టు కిందకు దిగడమేనని, అందుకే చరిత్రలో ఎన్నడూ లేనంతగా జీహెచ్ఎంసీలో హామీలు గుప్పించారని చర్చ నడుస్తోంది.

2014లో తొలిసారి సీఎం అయిన కేసీఆర్.. తనదైన రాజకీయ ఎత్తుగడలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలహీనంగా మార్చడంతో, కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనకు తిరుగు లేదని భావించారు. కానీ టీఆర్ఎస్ అసంతృప్తులు, కాంగ్రెస్‌ కీలక నేతలు బీజేపీలో చేరడంతో హస్తం పార్టీ సైడై పోయి, రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్‌ బీజేపీగా మారింది. ఇదేక్రమంలో దుబ్బాకలో బీజేపీ గెలుపొందడంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిణామాలను పసిగట్టిన కేసీఆర్, గ్రేటర్‌లో సామాన్యుల నుంచి హై రేంజ్‌ సినిమా వాళ్లను ఆకర్షించేలా హామీలు ఇచ్చారని విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇప్పటికే చేతిలో ఉన్న దుబ్బాక పోగొట్టుకొని ఉన్నందున ఇప్పుడు జీహెచ్ఎంసీలో వెనకపడితే, ఇక బీజేపీని ఆపడం సాధ్యం కాదని, అందుకే పెద్దఎత్తున హామీలతో పాటు, ప్రజలు జంకేలా మతకల్లోలాలు, అగ్గిమండే హైదరాబాద్ మాటలు చెప్పుకొచ్చారని భావిస్తున్నారు.

కాంగ్రెసోళ్లు సన్నాసులు, దద్దమ్మలు.. దేశంలో వాళ్ల ఉనికే లేదని, టీఆర్ఎస్సే ప్రజలకు శ్రీరామ రక్ష అంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్.. అధికారం చేపట్టినప్పటి నుంచి, తొలిసారిగా ఈ మధ్యకాలంలో బీజేపీకి భయపడుతున్నారని రాజకీయ నేతల్లో అంతర్గత చర్చ నడుస్తోంది. వీటిన్నింటికీ తోడు గత రెండు ప్రెస్‌మీట్లలో కత్తులతో పొడుచుకునే హైదరాబాద్ కావాలా అంటూ ప్రధానంగా చెప్పుకురావడం, కేవలం బీజేపీ టార్గెట్‌గా మాట్లాడుతున్నారన్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. పార్టీలో ఉన్న ఉద్యమ నేతలు, కాంగ్రెస్‌ నేతలు బీజేపీలోకి వెళ్లడం, దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా బీజేపీకి బలం కనిపిస్తుండటంతో ఆ పార్టీ పేరెత్తకుండానే విమర్శల దాడికి దిగుతున్నారన్న కామెంట్లు వినపడుతున్నాయి.

హైదరాబాద్ వరద బాధితులకు ఇచ్చే సాయం బీజేపీ నేతలు ఈసీకి లేఖ రాయడంతోనే ఆగిందని కేసీఆర్ వ్యాఖ్యానించడంతో.. దీనిపై గ్రేటర్‌లో పెద్ద దుమారం రేగి.. బండి సంజయ్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లడం కేసీఆర్‌కు కౌంటరేనని ప్రచారం జరిగింది. అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా రాష్ట్రంలో బలమైన పునాదులకు బీజేపీకి వ్యూహరచన చేస్తుండటంతో ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనే సత్తా చాటాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ గ్రేటర్‌లో కాషాయం పార్టీ డబుల్ డిజిట్‌ డివిజన్లు గెలిస్తే, 2023ఎన్నికల వరకు కేసీఆర్‌కు బీజేపీ భయం వెన్నంటే ఉంటుందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉనికి లేకుండా చేసేందుకు బీజేపీ జాతీయ నేతలతో చర్చలు జరిపే.. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు పరోక్షంగా కేసీఆరే కారణం అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.


Next Story

Most Viewed