వర్టికల్ గార్డెన్ కమీషన్ల కోసమేనా..?

by  |
vertical garden
X

దిశ ప్రతినిధి, మెదక్: పట్టణ ప్రజలకు, ప్రయాణికులకు ఆహ్లాదం, ఆనందం కలిగించేలా విద్యుత్ కాంతులతో ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్ వెలవెలబోతోంది. సిద్దిపేట పట్టణ ప్రజలకు మనసు రంజింపచజేయడం కోసం కొత్త బస్టాండ్ సమీపంలోని బావిస ఖాన పూల్ వద్ద రూ.20 లక్షలతో వర్టికల్ గార్డెన్ నిర్మించారు. దీనిని ఏప్రిల్ 11, 2021లో రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రారంభించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వర్టికల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మొక్కలు వర్షాకాలంలోనూ ఎండిపోతున్నాయి.

vertical garden2

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమా… కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో తెలీదు కానీ ఇప్పటి వరకు ఓ పదిసార్లకు పైగా మొక్కలను మార్చారు. అయినా చెట్లు ఎండిపోతూ పచ్చదనాన్ని కోల్పుతున్నాయి. వాడిపోయిన ప్రతిసారి మొక్కలు మార్చుతూ.. పైపై మెరుగులు దిద్దుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మొక్కలను ఏర్పాటు చేసి వాటికి సరైన రక్షణ, పోషక విలువలున్న మట్టి, ఎరువులు వాడడం లేదని సిద్దిపేట పట్టణ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

గార్డెన్ నిర్మాణంపై విమర్శల వర్షం

vertical garden3

సిద్దిపేట పట్టణ సౌందర్యాన్ని పెంచేందుకు, గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన వర్టికల్ గార్డెన్ (గోడ తోటలు) పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.20 లక్షలు వెచ్చిస్తే కనీసం ఇరవై రోజులు కూడా చెట్లు పచ్చగా కన్పించడం లేదని, ఇదే ఖర్చు మరే అభివృద్ధి పనికైనా పెడితే బాగుండేదని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతుండగా.. మరికొందరు ఆ రూ.20 లక్షలు రోడ్ల అభివృద్ధికి, గుంతలు మరమ్మతులు చేయించినా ఈ వానాకాలంలో బాగుండేదంటూ విమర్శిలు గుప్పిస్తున్నారు.

కాగా, వర్టికల్ గార్డెన్‌కు మహా అయితే రూ.రెండు, మూడు లక్షలు ఖర్చు కావొచ్చని, మిగతా నిధులు మొత్తం కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధుల కమిషన్ కోసమే వెచ్చించి ఉంటారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story

Most Viewed