తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం ఇక కష్టమేనా..?

by  |
SLBC
X

దిశ, తెలంగాణ బ్యూరో : అనుకున్నట్టే అయింది. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, నిపుణులు ముందు నుంచీ హెచ్చరిస్తున్నట్లే చేతుల నుంచి జారీ పోతున్నాయి. బోర్డు పరిధిని ఖరారు చేసేలోగా పాలమూరు–రంగారెడ్డి, డిండితో పాటు ప్రాజెక్టులను నిర్మించాలని నెత్తీనోరూ బాదుకుంటూనే ఉన్నారు. కానీ గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చూపించిన శ్రద్ధ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై చూపించలేదు. ఫలితంగా ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ఎలా ముందుకు వెళ్తాయనేది మిలియన్​డాలర్ల ప్రశ్న. వీటికి అనుమతులు తీసుకోవాలంటే ఇప్పుడు తేలే అంశమే కాదు. కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు రావడం కష్టసాధ్యమే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రధానంగా దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులు ఎలా ముందుకు పోతాయనేది తేలని ప్రశ్నగా మారింది.

ఏపీ విభజన తర్వాత కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించాయి. గతంలో కేసీఆర్‌-చంద్రబాబు, ప్రస్తుతం కేసీఆర్‌-జగన్‌ మధ్య ప్రాజెక్టుల విషయంలో ఓ అవగాహన కోసం తీవ్ర ప్రయత్నాలే జరిగాయి. కానీ ఓ దశ దాటిన తర్వాత రాష్ట్రాలు, ప్రాంతాలు, ప్రభుత్వాలు, ప్రయోజనాలంటూ ముఖ్యమంత్రులు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, చెప్పకున్న మాటలన్నీ పక్కకెళ్లిపోయాయి. ఒకప్పుడు మనం మనం అన్నీ సెటిల్‌ చేసుకుందాం అనుకున్న సీఎంలు కాస్తా ఎవరి వాదన వారు వినిపించారు. ఇప్పుడు జల యుద్ధానికి దిగారు.

డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే కదా..!

ఏపీ, తెలంగాణ జలవివాదాల నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్​6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్‌, కేసీఆర్‌ తమ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వ్యవహారాన్ని కృష్ణా బోర్డు పరిధిలోకి ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే ట్రైబ్యునల్‌లో కేటాయింపులపై విచారణ పూర్తి అయిన తర్వాతే బోర్డు పరిధి ఖరారు చేయాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్​ భేటీలో స్పష్టం చేశారు. కానీ కేంద్రం మాత్రం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టు కట్టాలన్నా, ఉన్న ప్రాజెక్టు నిర్వహణ చేయాలన్నా, నీటి కేటాయింపులు పెంచుకోవాలన్నా కృష్ణాబోర్డును ఆశ్రయించక తప్పని పరిస్ధితి వచ్చేసింది. దీంతో ఈ ప్రభావం రాయలసీమ లిఫ్ట్‌పై ఎంత ఉండబోతోందా.. తెలంగాణ కట్టబోతున్న ఆలంపూర్‌ పథకంపై ఉండబోతోందన్నదా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ రెండూ కొత్త ప్రాజెక్టులే కావడంతో తప్పనిసరిగా వీటి డీపీఆర్‌లను కృష్ణాబోర్డుకు అప్పగించి బోర్డు నిర్ణయం కోసం ఎదురుచూడాల్సిందే. కానీ ఇప్పటికే డీపీఆర్‌లు ఇవ్వడంలో రెండు రాష్ట్రాలూ రహస్యాన్ని పాటిస్తూనే ఉన్నాయి.

వీటి పరిస్థితి ఏంది..?

ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో అనుమతి లేనిప్రాజెక్టులను వివరించారు. ఏపీతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాజెక్టులకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. వాటిని పరిస్థితి ఎలా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే నిర్మాణాలు మొదలయ్యాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాటిపై ఎలా ముందుకెళ్తారనేది అనుమానాలే. గెజిట్‌లో అనుమతిలేని ప్రాజెక్టులను పేర్కొన్న కేంద్రం… ఆరునెలల్లో అనుమతులన్నీ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ అనుమతులు రాకుంటే మాత్రం ఇక ప్రాజెక్టును వదిలేసుకున్నట్టే. అయితే అనుమతి కూడా ఇప్పట్లో వచ్చే అవకాశాలు కూడా తక్కువే. ఎందుకంటే ఇప్పటి పరిస్థితుల ప్రకారం కేంద్రం ఏపీకి అనుకూలంగా ఉన్నట్లే ఉంది. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం కష్టమేనని ఇంజినీర్లు అంటున్నారు.

ఇవీ అనుమతి లేని ప్రాజెక్టులు

1). శ్రీశైలం లెఫ్ట్​బ్యాంకు కెనాల్​(ఎస్‌ఎల్‌బీసీ), ఇంటెక్, టన్నెల్, నక్కలగండి రిజర్వాయరు
2). శ్రీశైలం లెఫ్ట్​బ్యాంకు కెనాల్​ (ఎస్‌ఎల్‌బీసీ) అడిషనల్​10 టీఎంసీ ఇంటెక్​ వర్క్స్​
3). కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్​హౌస్​
4). కల్వకుర్తి ఎత్తిపోతల అదనపు 15 టీఎంసీల పంప్​హౌస్​
5). పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలు, పంప్​హౌస్, ఇతర పనులు
6). డిండి (నక్కలగండి) ఎత్తిపోతల
7). ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల్లో పంప్​హౌస్, ఇతర పనులు
8). భక్త రామదాసు ఎత్తిపోతల పథకం
9). తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పంప్​హౌస్, ఇతర పనులు
10). నెట్టెంపాడు ఎత్తిపోతలు పంప్​హౌస్, ఇతర పనులు
11). నెట్టెంపాడు ఎత్తిపోతల్లో 3.4 టీఎంసీల పంప్​హౌస్, ఇతర పనులు
12). మునియేరు ప్రాజెక్టు
13). మునియేరు ప్రాజెక్టు హెడ్​వర్క్స్, రిజర్వాయరు, స్పిల్​వే, రివర్​స్లూయిస్, కెనాల్ హెడ్​రెగ్యులేటర్.
14). దేవాదులలోని దుబ్బవాగు నుంచి పాకాల లేక్​ రెగ్యులేటర్​ వర్క్స్​
15). సీతారామ ఎత్తిపోతలలోని మూడో లిఫ్ట్‌లో నాలుగు పంప్​హౌస్‌లు.



Next Story

Most Viewed