కోచ్ ద్రవిడ్.. ఇదో కొత్త అధ్యాయం

by  |
కోచ్ ద్రవిడ్.. ఇదో కొత్త అధ్యాయం
X

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టులో ఉన్న ప్రతీ యువ క్రికెట్ వెనుక ఉన్న వ్యక్తి రాహుల్ ద్రవిడ్. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌లో ‘ది వాల్’ అనే పేరు తెచ్చుకున్న రాహుల్ ద్రవిడ్.. కొన్నాళ్లుగా యువ క్రికెటర్లను తీర్చి దిద్దడంలో విజయవంతం అయ్యాడు. రిషబ్ పంత్, పృథ్వీషా, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్ వంటి ఏంతో మంది క్రికెటర్లకు మిస్టర్ డిపెండబుల్ ద్రవిడే గురువు. బీసీసీఐ స్వయంగా సీనియర్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉండాలని ఆఫర్ ఇచ్చినా.. తాను మాత్రం ఇండియా అండర్-19, ఇండియా ‘ఏ’ జట్లకు కోచింగ్ ఇస్తూ భారత భవిష్యత్ క్రికెటర్లను తయారు చేశారు. ఆనాడు ద్రవిడ్ తీసుకున్న నిర్ణయమే ఈ రోజు ఎంతో మంది ప్రతిభ గల యువకులను వెలుగులోనికి తీసుకొని వచ్చింది. భారత క్రికెట్ చరిత్రలో తొలి సారిగా ఏక కాలంలో రెండు వేర్వేరు జట్లను విదేశీ పర్యటనలకు పంపగలిగే స్థాయికి చేరుకున్నది. ఒకప్పుడు జట్టులో ఒక కీలక ఆటగాడు గాయపడితే అతడి స్థానంలో ఎవరిని ఆడించాలా అనే ఆందోళనల స్థాయి నుంచి భారత క్రికెట్ జట్టు బెంచ్ పైనే మరో జట్టు ఉండే స్థాయి వరకు ఎదిగింది. ఇందులో బీసీసీఐ కృషితో పాటు రాహుల్ ద్రవిడ్ పాత్ర కూడా చాలా కీలకంగా మారింది.

భారత జట్టుతో ద్రవిడ్..

ఇన్నాళ్లూ జూనియర్ క్రికెటర్లతో అంతర్జాతీయ పర్యటనలు చేసి రాహుల్ ద్రవిడ్‌ను భారత సీనియర్ జట్టుకు కోచ్‌గా పంపనున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్.. ఎంతో మంది క్రికెటర్ల టెక్నిక్‌ను సరిదిద్దాడు. అంతే కాకుండా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చడానికి చాలా కృషి చేశాడు. అండర్ 19 జట్టు ప్రపంచ కప్ గెలవడానికి రాహుల్ శిక్షణ కూడా కారణమైంది. గతంలో సీనియర్ జట్టుకు కోచ్ అవకాశం వచ్చినా వదులుకున్నాడు. కానీ శ్రీలంక పర్యటనకు మాత్రం రాహుల్ ఓకే చెప్పాడు. టీమ్ ఇండియాలో రెగ్యులర్ సభ్యులైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లు లేకుండానే పరిమిత ఓవర్లు స్పెషలిస్టులతో శ్రీలంక పర్యటనకు వెళ్లాలని బీసీసీఐ నిర్ణయించింది. టెస్టు జట్టు కోచ్ రవిశాస్త్రి కూడా ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడే.. శ్రీలంకకు భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడటానికి వెళ్లనున్నది. దీంతో రాహుల్ ద్రవిడ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించనున్నది. రవిశాస్త్రితో పాటు భరత్ అరుణ్, విక్రమ్ రాథోడ్ కూడా అందుబాటులో ఉండటం లేదు. దీంతో భారత జట్టుతో రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఎన్ఏసీ కోచింగ్ స్టాఫ్ వెంట వెళ్లనున్నారు. ద్రవిడ్ జట్టుతో ఉండటం అదనపు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.

భవిష్యత్ కోచ్ అతడేనా?

ప్రస్తుత భారత జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం 2021 చివర్లో ముగియనున్నది. 2017 నుంచి భారత జట్టుకు పూర్తి స్థాయి కోచ్‌గా పని చేస్తున్న రవిశాస్త్రి అంతకు ముందు క్రికెట్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. కొన్నాళ్లు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించారు. అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన తర్వాత రాహుల్ ద్రవిడ్‌నే కోచ్‌గా నియమించాలని బీసీసీఐ భావించింది. కానీ సీనియర్ ప్లేయర్లకు తాను కోచింగ్ ఇవ్వడం సబబు కాదని జూనియర్ల జట్టును ఎంచుకున్నాడు. ప్రస్తుతం టీమ్ ఇండియాలో ఉన్న చాలా మంది యువ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్ కోచింగ్ ద్వారా ఎదిగిన వాళ్లే. రాబోయే రెండు మూడేళ్లో కీలకమైన సిరీస్‌లతో పాటు ఐసీసీ ఈవెంట్లు కూడా ఉన్నాయి. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత రవిశాస్త్రి పదవీ కాలం ముగియనున్నది. దీంతో కొత్త కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌నే నియమిస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం తన ప్రొడక్ట్ క్రికెటర్లే జట్టులో ఉండటంతో ద్రవిడ్ కూడా కోచ్ పదవి పట్ల ఆసక్తి చూపిస్తాడని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. భవిష్యత్‌లో ద్రవిడే హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.



Next Story

Most Viewed