విద్యుత్ సంస్థల నష్టాలకు సీఎం కేసీఆరే కారణమా..?

by  |
Power1
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సర్కార్​వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. అయితే తెలంగాణలో వాడుకునే విద్యుత్‌లో సగానికి పైగా వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. దీంతో డిస్కంలకు ఆదాయం తగ్గి, ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. రాష్ట్రం మొత్తం వినియోగం 38,067.82 మిలియన్​యూనిట్లు ఉంటే అందులో వ్యవసాయానికే 20,258.50 మిలియన్​యూనిట్ల వాడకం జరుగుతోంది. మిగిలిన 17,809.32 మిలియన్ యూనిట్ల ద్వారా వచ్చే ఆదాయంతోనే విద్యుత్​సంస్థల నిర్వహణ కొనసాగుతోంది. అందులో నుంచే వారికి వేతనాలు, ఇతర ఖర్చులను భరిస్తోంది. దీనికితోడు మొండి బకాయిలు పేరుకుపోవడంతో ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి సంస్థలను గట్టెక్కించడం యాజమాన్యానికి సవాల్‌గా మారింది.

2020-21 సంవత్సరానికి గాను తెలంగాణ వ్యాప్తంగా లో టెన్షన్‌లో భాగంగా జరిగే విద్యుత్​వినియోగం 38,067.82 మిలియన్​యూనిట్లుగా ఉందని డైరెక్టరేట్​ఆఫ్​ఎకనామిక్స్​అండ్​స్టాటిస్టిక్స్​ద్వారా తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 65 శాతానికి పైగా వాడకం వ్యవసాయానికే వినియోగిస్తున్నారు. కాగా గృహావసరాలకు వినియోగించే విద్యుత్​12,832.77 మిలియన్ యూనిట్లుగా ఉంది. నాన్​డొమెస్టిక్​అయితే 2,831.23 మిలియన్​యూనిట్లుగా పేర్కొంది. ఇండస్ట్రియల్‌కు 1,156.36, కాటేజ్​ఇండస్ట్రీస్‌కు 43 మిలియన్​యూనిట్లు, వీధి దీపాలకు 814.28 మి.యూ, సాధారణ అవసరాలకు 75.97 మి.యూ, టెంపరరీ అవసరాలకు 55.69 మి.యూ వినియోగిస్తున్నారు. ఈవీ చార్జింగ్​స్టేషన్లు అత్యల్పంగా కేవలం 0.02 మిలియన్​యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విద్యుత్​వినియోగం రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. 2014‌‌-15లో రాష్ట్రంలో కరెంట్​వాడకం 39,519 మిలియన్​యూనిట్లు ఉంటే క్రమంగా 2015-16లో 41,045 మి.యూ, 2016-17లో 44,783 మి.యూ, 2017-18లో 50,442 మి.యూ, 2018-19లో 57,454 మి.యూ, 2019-20లో 58,515 మి.యూ, 2020-21 మార్చి 31వ తేదీ నాటికి 57,007 మిలియన్​యూనిట్ల విద్యుత్​వినియోగం జరిగింది. అదే ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 65 వేల మిలియన్​యూనిట్లకు పైగా చేరుకుంది.

తెలంగాణలో అన్ని రకాల విద్యుత్​ప్లాంట్లు కలిపి 16,563 మెగావాట్ల కెపాసిటీని కలిగిఉన్నాయి. థర్మల్​10,289 మెగావాట్లు, హైడల్​2518 మెగావాట్లు, సోలార్, ఇతర నాన్​కన్వెన్షనల్​ఎనర్జీ సిస్టమ్స్​ద్వారా 3755 మెగావాట్ల కెపాసిటీని కలిగి ఉన్నాయి. కాగా థర్మల్​ద్వారా 47,604 మిలియన్​యూనిట్ల విద్యుత్​ఉత్పత్తి చేస్తున్నారు. 3424 మిలియన్​యూనిట్ల జల విద్యుత్, సోలార్, విండ్​నుంచి 6555 మిలియన్​యూనిట్లు ఉత్పత్తి అవుతుండగా ప్రైవేట్​వ్యక్తుల నుంచి 8972 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను కొనుగోలు చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణలో విద్యుత్​సంస్థలు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయాయి. వాటి నుంచి ఎలా గట్టెక్కేదంటూ ప్రణాళికలు చేస్తున్నాయి. పెండింగ్​విద్యుత్​బకాయిల రికవరీకి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. కాగా అది సైతం అంతంతమాత్రమే సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్​అందిస్తోంది. దీనివల్ల సంస్థకు తక్కువ రెవెన్యూ వచ్చి నిర్వహణ భారం పెరిగిపోవడంతో డిస్కంల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయింది. ఈ స్థితి నుంచి సంస్థలు గట్టేక్కేందుకు యాజమాన్యాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.


Next Story