పైసలు ఇచ్చుకో..పోడు కొట్టుకో.. వైఎస్ఆర్‌నగర్ వెనుక ఏం జరుగుతోంది

by  |
పైసలు ఇచ్చుకో..పోడు కొట్టుకో..  వైఎస్ఆర్‌నగర్ వెనుక ఏం జరుగుతోంది
X

దిశ,మణుగూరు : పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలం పీ.వీ కాలనీలోని వై.ఎస్.ఆర్ నగర్ పేరుతో ఫారెస్ట్ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి వేలరూపాయలు సంపాదించారనే టాక్ మండలంలో జోరుగానే వినిపిస్తుంది. ఫారెస్ట్ భూమిని, అడవిని కాపాడాల్సిన అటవీశాఖ అధికారులే పైసలు ఇచ్చుకో.. పోడు కొట్టుకో.. అనే చందంగా వ్యవహరిస్తున్నారని వై.ఎస్.ఆర్ నగర్ ప్రాంతం ద్వారా తేటతెల్లమౌవుతోంది. ముగ్గురు పార్టీ నాయకులు, ఇద్దరు సింగరేణి ఉద్యోగులు కలసి వై.ఎస్.ఆర్ నగర్ పేరుతో పోడుభూమిని కొని అమాయకమైన ప్రజలకు కట్టబెట్టి లక్షలరూపాయల్లో పోడుభూమిని విక్రయించారని స్థానికుల ద్వారా తెలుస్తోంది.

వై.ఎస్.ఆర్ నగర్ ప్రాంతంలో ఇంటి పర్మిషన్ లేకుండా, కరెంట్ సౌకర్యం కూడా లేకుండా జీవిస్తున్నరని స్థానికులు తెలుపుతున్నారు. ముగ్గురు పార్టీ నాయకులు ఫారెస్ట్ అధికారులను, సింగరేణి అధికారులను, రెవిన్యూ అధికారులను ముడుపులతో మచ్చిక చేసుకొని ఆ ప్రాంతంలో దందా కొనసాగిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు వై.ఎస్.ఆర్ నగర్ ఉంటున్నవారికి ఇంటి పన్ను, కరెంట్ మీటర్లు లేకపోవడం గమనార్హం. ఇంటి పన్ను కోసం పంచాయతీ వాళ్లను, కరెంట్ మీటర్ కోసం విద్యుత్ అధికారులను తమ ఆధీనంలో ఉంచుకొని ఆ రెండు పర్మిషన్ కల్పించబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఆరెండు పర్మిషన్లు కల్పిస్తే తమని అడిగే వారేలేరని ధీమాతో ఉంటున్నారని స్థానికులు వాపోతున్నారు. వై.ఎస్.ఆర్ నగర్ కబ్జాలో లక్షల రూపాయల కుంభకోణం ఉందని విశ్వసనీయ సమాచారం.

వై.ఎస్.ఆర్ కాలనీ తెరచాటున ఫారెస్ట్ అధికారులు ఉండి ఈ దందాను నడిపిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈకబ్జా విషయంలో అటవీశాఖ అధికారుల వాటా పెద్ద మొత్తంలో ఉందని ఈకబ్జా ద్వారా తెలిసిపోతుంది. ఫారెస్ట్ భూమిని కాపాడాల్సిన అధికారులే ముడుపులకు అలవాటు పడితే ఫారెస్ట్ ని కాపాడేది ఎవరని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. మొత్తానికి వై.ఎస్.ఆర్ కాలనీ పేరు మీద ముడుపులు భారీగా చేతులు మారాయని ప్రజల టాక్. ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ భూములను పట్టించుకోకపోవడం వలనే రోజు రోజుకి అక్రమంగా పోడు భూమిని కొట్టి, ప్రాంతాలుగా ఏర్పర్చుకుంటున్నారని పలు మేధావులు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని,ఆ ముగ్గురు పార్టీ నాయకులతో పాటు, కబ్జాకు సహకరించిన ఫారెస్ట్ అధికారులపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని మండల ప్రజలు,ప్రజా సంఘాలు,పలు మేధావులు కోరుతున్నారు.

Next Story