రిజిస్టర్ ఏమైంది.. స్వామివారి నగలకు లెక్కా పత్రం లేదా?

by  |
Phanigiri Sitaramachandraswamy
X

దిశ, హుజూర్ నగర్: ఆ సీతారామునిది ఘనమైన కీర్తి. ఊరు పుట్టినప్పటి నుండి ప్రతి ఏటా జాతర.. వందలాది ఎకరాల దేవుని మాన్యం. కానీ, దేవాలయ భూములు, కౌలు రైతుల వివరాలు, స్వామివారి ఆభరణాల విషయంలో మాత్రం అంతుచిక్కని అనుమానాలు రేకెత్తుతున్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయ శివారులో ఉన్న ఫణిగిరి సీతారామచంద్రస్వామి ఆలయాలకు కొన్ని ఏళ్ళుగా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ ట్రస్టీలుగా కొనసాగుతున్నారు. రెండు బ్రాంచ్‌లకు చెందిన 6 ఫ్యామిలీలు, 2 ఏళ్ల రోస్టర్ పీరియడ్‌లో రెండు ఆలయాలకు కలిపి ట్రస్టీలుగా చేస్తున్నారు. ట్రస్టీలు మారుతుండటంతో.. ఆలయ భూములు, స్వామి వారి ఆభరణాలకు సంబంధించిన రిజిస్టర్ల విషయంలో పట్టణ ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కౌలుదారుల రిజిస్టర్ ఏమైనట్లు..?

ఫణిగిరి సీతరామచంద్రస్వామికి 647 ఎకరాలు దేవుని మాన్యం ఉంది. అందులో మోడల్ కాలనీలో వీకర్ సెక్షన్స్ ఇళ్ళ స్థలాలకు, ఎన్నెస్పీ కాల్వ, వృద్ధ ఆశ్రమాలకు కలిపి 168 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 459 ఎకరాలు హుజూర్ నగర్, రామలక్షీపురానికి చెందిన 300 మంది కౌలు రైతులు సాగుచేసుకుంటున్నారు. కానీ కౌలు రైతులకు సంబంధించిన వివరాలు మాత్రం 2016 నుండి మాత్రమే ఆలయ ఆఫీసు రికార్డులలో ఉన్నాయి. అంతకు ముందు రికార్డు ఏమైందనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ట్రస్టీగా ఉన్న.. ఓ స్థానాచార్యుడు అంతకుముందు ఉన్న కౌలుదారుల రిజిస్టర్(డిమాండ్ కలెక్షన్ బాలెన్స్) తన వద్దే ఉంచుకుని దేవాదాయ శాఖకు అప్పగించలేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. నిబంధనల ప్రకారం దేవాదాయ భూములు అమ్మకం, కొనుగోళ్ళు నిషేదం కాగా, గతంలో జరిగిన క్రయ విక్రయాలు, కౌలు రైతుల పేర్ల మార్పిడి విషయాలు బయటకు పొక్కుతాయనే, రికార్డు దేవాదాయ శాఖకు అప్పగించలేదనే ప్రచారం జరుగుతోంది. కాకతీయ కాలం నాటి చరిత్ర కలిగిన 600 ఎకరాల దేవుని మాన్యానికి సంబంధించిన వివరాల రికార్డు కేవలం 2016 నుండి మాత్రమే అందుబాటులో ఉండటం పట్టణ ప్రజలను ఆశ్చర్య పరుస్తోంది.

స్వామి వారి నగలకు లెక్కపత్రం ఏది..!

ఆలయానికి సంబంధించి ఆదాయ వ్యయాలు, భూముల వివరాలు, బంగారు, వెండి ఆభరణాలు, సిబ్బంది జీత భత్యాలకు సంబంధించిన వివరాలు దేవాదాయ శాఖ నిర్దేశించిన 43 రిజిస్టర్‌లో విధిగా పొందు పరచాలి. కానీ స్వామివారి ఆభరణాలకు సంబంధించి ఇన్వెంటరీ రిజిస్టర్ (వెండి బంగారు ఆభరణాలు స్టాక్ రిజిస్టర్)2009 వరకు మాత్రమే ఉంది. అందులో 15 తులాల బంగారం మాత్రమే ఉన్నట్లు నమోదు చేశారు. రికార్డులో ఆభరణాలు ఇచ్చిన తేదీ, దాతల వివరాలు, మచ్చుకైన కనిపించక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రిజిస్టర్‌లో వివరాలను గతంలో పనిచేసిన ట్రస్టీల కనుసైగల్లోనే నమోదు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కౌలు రైతులు, స్వామి వారి నగలకు సంబంధించిన రిజిస్టర్లను గతంలో పని చేసిన ట్రస్టీ నుండి దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకంటే ఇంకొన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది.

మాన్యం భూములు.. పట్టాలు చేసుకున్నరు..!

పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయ పరిధిలో 51.26 ఎకరాల దేవుని మాన్యంలో ఇదే తంతు జరుగుతోంది. మాన్య భూములలో ఆలయ అర్చకులకు 21.39 ఎకరాలు, స్థానాచార్యులకు 18 ఎకరాలు .. సర్వీస్ ఇనామ్ కింద అనుభవిస్తున్నారు. కానీ, దేవాలయ భూములను దొడ్డిదారిన తమ పేర పట్టాలు చేసుకున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎండోమెంట్ నిబంధనలకు విరుద్ధంగా పట్టా చేసుకున్న భూములను తిరిగి మ్యుటేషన్ చేయాలని పలుమార్లు శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.

కమిటీ వేస్తే.. కోర్టుకు పోయారు

ఆలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇటీవల 7 గురు సభ్యులతో పాలక మండలి కమిటీ ఏర్పాటు చేశారు. మే 18న సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా అదే రోజున కమిటీ నియామకాన్ని సవాలు చేస్తూ కోర్టులో రిట్ వేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్ట్ ఎండో మెంట్ అధికారులను ఆదేశించింది. ఆలయ అభివృద్ధి కోసం ఏర్పాటైన పాలక మండలి కమిటీని, ఫౌండర్ మెంబర్స్ అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని, కమిటీ ఉంటే జవాబుదారీతనం పెరుగుతుందనే కోర్టుకు వెళ్ళారనే చర్చ స్థానికంగా జరుగుతోంది.

Next Story