‘డబుల్’ ఇళ్లలో అక్రమాలు.. సర్పంచ్‌దే కీలక పాత్ర!

by  |
double bedroom houses in Kuchanpally
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ఇండ్లు ఇప్పిస్తామని లబ్ధిదారుల నుండి భారీగా డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ అక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్‌లు సైతం డబుల్ ఇండ్ల పేరు మీద వసూళ్లకు పాల్పడడంతో లబ్ధిదారులు ఆందోళన చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పేరిట లబ్ధిదారుల వద్ద భూమి కొనుగోలుకు కొందరు డబ్బులు తీసుకున్నారు. తీరా.. ఇండ్లు నిర్మించిన తర్వాత అర్హులకు ఇవ్వకుండా, అక్రమాలకు పాల్పడడ్డారు. వివరాల్లోకి వెళితే.. 2018 సంవత్సరంలో నాటి గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి కూచనపల్లి గ్రామస్తులు 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టి 54 మంది అర్హులైన నిరుపేదలను గుర్తించారు. దీంతో గ్రామంలో ఇండ్లు నిర్మించడానికి ప్రభుత్వ భూమి లేకపోవడంతో.. అర్హులైన లబ్ధిదారుల వద్ద రూ.20 నుంచి 30 వేల వరకు తీసుకొని గ్రామ సర్పంచ్ శివారులో భూమి కొనుగోలు చేశాడు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో నిర్మాణం పూర్తి చేసుకున్న 30 ఇళ్లలో గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులలో కొందరిని తొలగించారు. ఆర్థికంగా బలంగా ఉండి, ఇండ్లు ఉన్నవారి పేరును అందులో యాడ్ చేశారు. గ్రామ సర్పంచ్‌పై అనుమానం వచ్చిన లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. పాత లిస్టులో తొలగించిన 8 మంది పేర్లను వెంటనే యాడ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్‌కు సైతం వినతిపత్రం అందజేశారు. ఇదే విషయమై సర్పంచ్‌ను సంప్రదించగా.. ‘‘మా ఇష్టం వచ్చిన వాళ్లకు ఇస్తాం’’ అని ఇష్టానుసారంగా మాట్లాడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. అనుచరులతో కలిసి గ్రామ సర్పంచ్ లబ్ధిదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని వాపోతున్నారు. అధికారులు స్పందించాలని వేడుకుంటున్నారు.

ప్రభుత్వం అర్హులైన వారికి అనుమతి పత్రం ఇవ్వకుండానే.. తనకు డబ్బులు ఇచ్చిన లబ్ధిదారులకు మాత్రమే ఇస్తామని సర్పంచ్ చెప్పారని లబ్ధిదారులు చెబుతున్నారు. కాగా, ‘‘మాకు ఎలాంటి ఇంటి హక్కు పత్రాలు ప్రభుత్వం నుండి రాలేదు. ఏ అధికారి కూడా మమ్మల్ని ఇంట్లో ఉండమని చెప్పలేదు. అయినా.. ఈ డబుల్ ఇళ్లలో వచ్చి ఉంటున్నాం. అంతా సర్పంచ్ చూసుకుంటాడు.’’ అని ఇళ్లలో ఉంటున్న అనర్హులు ఏకంగా మీడియా ఎదుటే చెప్పడం గమనార్హం. అంతేగాకుండా.. తమకు సర్పంచ్ హక్కు పత్రాలు ఇస్తానని చెప్పినట్లు వారు వెల్లడించారు. అయితే, హక్కు పత్రాలు లేకుండా ఇళ్ళలో ఉండే అర్హత వారికి లేదని, ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నా.. సర్పంచ్ వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. లబ్ధిదారుల ఎంపికపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేసి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని, సర్పంచ్‌పై కూడా చర్య తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed