రూ. లక్ష కోట్ల క్లబ్‌లో ఐఆర్‌సీటీసీ

by  |
IRCTC1
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్లబ్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ మైలురాయిని అధిగమించిన తొమ్మిదో ప్రభుత్వ రంగ సంస్థగా రికార్డ్‌ సృష్టించింది. ప్రస్తుత ఏడాది ఇప్పటివరకు ఈ సంస్థ 300 శాతానికి పైగా ర్యాలీ చేసింది. గత ఐదు సెషన్లలోనే సంస్థ షేర్ ధర ఏకంగా 33 శాతం పెరిగి ప్రస్తుతం బీఎస్ఈలో రూ. 1,00,612 కోట్లతో విలువ పరంగా 57వ స్థానంలో కొనసాగుతోంది. దేశీయంగా ఇటీవల సానుకూల పరిస్థితులతో స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్ఠాల వద్ద కదలాడుతున్నాయి. ఐఆర్‌సీటీసీ విషయానికి వస్తే.. పండుగ సీజన్ కారణంగా సంస్థ వెబ్‌సైట్ అధిక డిమాండ్‌ను చూసింది. కొన్ని రైళ్ల సర్వీసులు 100 శాతం బుకింగ్ సాధించాయి. అంతేకాకుండా మరో 2-3 నెలల పాటు శబరిమలైకు వెళ్లే రైళ్లతో పాటు ప్రధాన నగరాల మధ్య రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్‌ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది.

ఇదే సమయంలో రైల్వే మంత్రిత్వ శాఖ రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులను ప్రారంభించనున్నట్టు ప్రకటించడంతో ఈ షేర్ కోసం పెట్టుబడిదారులు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ షేర్ మంగళవారం దాదాపు 8 శాతం పుంజుకుని రూ. 6,324 వద్ద ట్రేడవుతోంది. కాగా, 2019 అక్టోబర్ 14న ఐఆర్‌సీటీసీ సంస్థ బీఎస్ఈలో లిస్టింగ్ చేయబడింది. అప్పటి నుంచి రికార్డు స్థాయిలో 1,737 శాతానికి పైగా వృద్ధితో 18 రెట్లు పెరిగింది. ఈ ఏడాదిలో మాత్రమే 308 శాతం, అక్టోబర్ నెలలో 58 శాతం లాభపడింది. దీనికి ముందు రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ క్లబ్‌లో ఎస్‌బీఐ, కోల్ ఇండియా, ఐఓసీఎల్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బీపీసీఎల్, ఎస్‌బీఐ కార్డ్, ఎన్ఎండీసీ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి.

Next Story

Most Viewed