- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : నేడే ఐపీఎల్ ఫైనల్.. టైటిల్ బెంగళూరుదా?.. పంజాబ్దా?
ఐపీఎల్-18 ఆఖరి ఘట్టానికి సమయం ఆసన్నమైంది.

దిశ, స్పోర్ట్స్ : పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్న జట్లు. కానీ, ఒక్కసారి కూడా టైటిల్ గెలలేకపోయాయి. తొలి టైటిల్ కోసం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరదించే అవకాశం ఇరు జట్లకు వచ్చింది. అద్భుతమైన ప్రదర్శనతో ఆర్సీబీ, పంజాబ్ ఫైనల్లో అడుగుపెట్టాయి. కానీ, టైటిల్ గెలిచేది ఒక్క జట్టే. ఫలించేది ఒక జట్టు నిరీక్షణనే. మరోజట్టుకు ఎదురుచూపు తప్పదు. మరి, బెంగళూరు, పంజాబ్ జట్లలో ఏ జట్టు తమ తొలి కప్పును ముద్దాడుతుందో..
ఐపీఎల్ 18వ సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. నేడే తుది సమరం. మంగళవారం అహ్మదాబాద్లో జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకోనున్నాయి. రెండు నెలలకుపైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులను అలరించింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లీగ్కు కాస్త బ్రేక్ పడినా ఆ తర్వాత మళ్లీ పున:ప్రారంభమైంది. 10 జట్లలో పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ టీమ్లు ప్లేఆఫ్స్కు చేరుకున్నాయి. అందులో క్వాలిఫయర్-1లో పంజాబ్ను ఆర్సీబీ ఓడించి నేరుగా ఫైనల్కు చేరుకుంది. ఎలిమినేటర్లో గుజరాత్ ఓడి ఇంటిదారిపట్టగా.. ముంబై క్వాలిఫయర్-2కు చేరుకుంది. సోమవారం జరిగిన క్వాలిఫయర్-2 పోరులో ముంబైకి షాకిస్తూ పంజాబ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇక అసలైన పోరు పంజాబ్, బెంగళూరు మధ్య జరగనుంది.
ఆర్సీబీకి ఫైనల్ గండం
‘ఈ సారి కప్ మనదే’ అంటూ ప్రతి సీజన్లోనూ అడుగుపెట్టడం తీరా ఉత్తచేతులతో ఇంటిదారిపట్టడం ఆర్సీబీకి అలవాటుగా మారింది. 17 సీజన్లుగా ఏదో ఒక దశలో ఆ జట్టు నిష్ర్కమించింది. ఇంతకుముందు 9సార్లు ప్లే ఆఫ్స్కు చేరుకున్నా నిరాశతప్పలేదు. అందులో మూడుసార్లు ఫైనల్లోనే బోల్తాపడటం గమనార్హం. ఈ సారి ఎలాగైనా కప్పు గెలవాలనే పంతంతో బరిలో నిలిచిన ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. లీగ్ దశలో ఆడిన 13 మ్యాచ్ల్లో 9 విజయాలు నమోదు చేసి రెండో స్థానంలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆ జట్టు సమిష్టిగా పోరాడుతూ విజయాలు అందుకుంటుంది. కింగ్ కోహ్లీ సీజన్ ఆద్యంతం జట్టుకు అండగా నిలబడ్డాడు. 14 మ్యాచ్ల్లో 614 రన్స్ చేశాడు. ఆర్సీబీ ప్రధాన బలం అతనే. విరాట్ తర్వాత ఫిలిప్ సాల్ట్ కూడా ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్ రజత్ పటిదార్, జితేశ్ శర్మలు కూడా టచ్లో ఉన్నారు. మయాంక్ అగర్వాల్, లివింగ్స్టోన్, షెఫెర్డ్, కృనాల్ పాండ్యా రూపంలో 8వ స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉండటం ఆర్సీబీకి ప్లస్ పాయింట్. ఇక, బౌలింగ్ యూనిట్ కూడా బలంగా ఉంది. గత మ్యాచ్లో పంజాబ్ను 101 రన్స్కే ఆలౌట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో హేజల్వుడ్ అద్భుతమైన బౌలింగ్తో ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 11 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. కృనాల్, భువనేశ్వర్, యశ్ దయాల్ కూడా రాణిస్తుండటంతో ఆర్సీబీ బౌలింగ్ దళానికి ఢోకాలేదనే చెప్పాలి.
అయ్యర్ టైటిల్ అందిస్తాడా?
గత సీజన్లో కోల్కతాను చాంపియన్గా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో పంజాబ్ను విజయపథంలో నడిపిస్తున్నాడు. 11 ఏళ్ల తర్వాత పంజాబ్ను ప్లే ఆఫ్స్కు చేర్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టడం ఇది రెండోసారి మాత్రమే. ఢిల్లీ, కోల్కతా, పంజాబ్.. మూడు జట్లను ప్లే ఆఫ్స్కే చేర్చిన ఏకైక కెప్టెన్గా అయ్యర్ ఘనత సాధించాడు. అయ్యర్ కెప్టెన్సీపై జట్టు నమ్మకంగా ఉంది. అలాగే, ప్లేయర్గా కూడా అదరగొడుతున్నాడు. 16 మ్యాచ్ల్లో 603 పరుగులు చేశాడు. అయ్యరే కాకుండా మిగతా బ్యాటర్లు కూడా ఫామ్లో ఉండటంతో పంజాబ్ బ్యాటింగ్ దళం చాలా బలంగా ఉంది. ఓపెనర్లు ప్రభ్సిమ్రాన్(523), ప్రియాన్ష్ ఆర్య(451) జట్టుకు శుభారంభాలు అందిస్తున్నారు. నేహాల్, శశాంక్ సింగ్ కూడా టచ్లోనే ఉన్నారు. కాబట్టి, పంజాబ్ బ్యాటర్లను నిలువరించడం ఆర్సీబీ బౌలర్లకు సవాలే. ఇక, బౌలింగ్ దళంలో అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్, యుజువేంద్ర చాహల్ జట్టుకు అండగా నిలుస్తున్నారు.
బెంగళూరు 18.. పంజాబ్ 18
ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య పోరు కూడా ఆసక్తికరంగానే ఉంది. హెడ్ టూ హెడ్లో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. ఇప్పటివరకు 36 సార్లు ఎదురుపడ్డారు. అందులో ఆర్సీబీ 18 విజయాలు నమోదు చేస్తే.. పంజాబ్ కూడా 18 మ్యాచ్ల్లో నెగ్గింది. అయితే, చివరి ఐదు మ్యాచ్ల్లో ఆర్సీబీనే ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగు గేముల్లో నెగ్గింది. పంజాబ్ ఒక్క మ్యాచ్లో మాత్రమే గెలిచింది.
వర్షం వస్తే?
అహ్మదాబాద్లో సోమవారం ముంబై, పంజాబ్ మధ్య జరిగిన క్వాలిఫయర్-2కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. నేడు జరిగే ఫైనల్కు కూడా వర్ష గండం ఉన్నట్టు అహ్మదాబాద్ వాతావారణ విభాగం అంచనా వేసింది. మంగళవారం రోజంతా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అహ్మదాబాద్తోపాటు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఫైనల్ జరుగుతుందా?లేదా? అన్న ఆందోళన నెలకొంది. అయితే, ఫైనల్కు రిజర్వ్ డే ఉంది. మంగళవారమే మ్యాచ్ను ముగించడానికి అంపైర్లు ప్రయత్నిస్తారు. అదనంగా 120 నిమిషాలు కేటాయించారు. ఒకవేళ వర్షం కారణంగా మంగళవారం వర్షార్పణమైతే బుధవారం మ్యాచ్ను నిర్వహిస్తారు. రిజర్వ్ డేలో కూడా వర్షం కురిసి ఆట సాగకపోతే లీగ్ దశలో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ను విజేతగా ప్రకటిస్తారు. అయితే, ఫలితాన్ని తేల్చడానికి అంపైర్లు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఆఖరికి ఇన్నింగ్స్కు ఐదు ఓవర్ల చొప్పున నిర్వహిస్తారు. 2023లో అహ్మదాబాద్లోనే గుజరాత్, చెన్నయ్ మధ్య జరిగిన ఫైనల్కు వర్షం అంతరాయం కలిగించిన విషయం తెలిసిందే. ఫైనల్ రోజున ఒక్క బంతి కూడా పడలేదు. రిజర్వ్ డేన మ్యాచ్ నిర్వహించగా అప్పుడు కూడా వరుణుడు తగిలాడు. సెకండ్ ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 171గా నిర్ణయించగా ఆ టార్గెట్ను చెన్నయ్ ఛేదించి చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.






