దిగ్వేశ్‌పై ఒక మ్యాచ్ నిషేధం.. అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత

by Phanindra |

దిగ్వేశ్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించినట్లు ఐపీఎల్ తెలిపింది. అలాగే అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేసింది.

దిగ్వేశ్‌పై ఒక మ్యాచ్ నిషేధం.. అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత
X

దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగిన లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ కన్నెర్ర చేసింది. పలుమార్లు ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన దిగ్వేశ్ మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ వేయడంతోపాటు ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించింది. అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో కూడా 25 శాతం కోత విధించింది.

‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను దిగ్వేశ్ ఉల్లంఘించాడు. ఇది ఈ సీజన్‌లో అతను చేసిన మూడో తప్పు. ఇప్పటికే మూడు డీమెరిట్ పాయింట్స్ ఉన్న అతను.. సన్‌రైజర్స్‌తో మ్యాచులో మరో రెండు డీమెరిట్ పాయింట్స్ అందుకున్నాడు. మొత్తం ఐదు డీమెరిట్ పాయింట్స్ అవడంతో అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత, ఒక మ్యాచ్ నిషేధం విధించడం జరిగింది. గుజరాత్ టైటాన్స్‌తో లక్నో ఆడే తదుపరి మ్యాచ్‌లో దిగ్వేశ్‌ను సస్పెండ్ చేశాం. అభిషేక్ శర్మకు ఇదే తొలి తప్పిదం కావడంతో అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించాం’ అని ఐపీఎల్ యాజమాన్యం వెల్లడించింది.

Next Story