కేకేఆర్ బ్యాటర్‌కు షాక్.. మ్యాచ్ ఫీజులో కోత..

by Disha Web Desk 13 |
కేకేఆర్ బ్యాటర్‌కు షాక్.. మ్యాచ్ ఫీజులో కోత..
X

బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ జేసన్ రాయ్‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. బుధవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతను ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించడంతో రాయ్ మ్యాచ్ ఫీజులో కోత విధించారు. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండెక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. రాయ్ లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించాడు. అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధిస్తున్నాం.’ అని ఐపీఎల్ నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్సీబీపై ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కోల్‌కతా 21 పరుగుల తేడాతో విజయం సాధించి తిరిగి గెలుపు బాట పట్టిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన రాయ్ 29 బంతుల్లో 56 పరుగులు చేసి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, 10వ ఓవర్‌ వేసిన వైషాక్ బౌలింగ్‌లో రాయ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బంతి కాళ్ల మధ్యలో నుంచి వెళ్లి వికెట్లను తాకింది. దాంతో నిరాశచెందిన రాయ్ కింద పడిన బెయిల్స్‌లో ఒకదాన్ని బ్యాటుతో కొట్టాడు. రాయ్ చేసిన ఈ చర్యతోనే మ్యాచ్ రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో కోత పెట్టినట్టు తెలుస్తోంది.


Next Story