వీసా హద్దు.. ఇక ఐపీఎల్ రద్దు!

by  |
వీసా హద్దు.. ఇక ఐపీఎల్ రద్దు!
X

దిశ, వెబ్‌డెస్క్:
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఈసారి జరిగే అవకాశాలు కనిపించడంలేదు. ప్రపంచ అంటు రోగంగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించడం, దేశంలో కూడా పెద్ద ఎత్తున కొత్త కేసులు నమోదవుతుండటంతో ఈ మెగా టోర్నీ నిర్వహణకు దాదాపు దారులు మూసుకుపోయాయి. పీటీఐ సమాచారం ప్రకారం విదేశీ వీసాల రద్దు నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు భారత్‌లోకి విదేశీ క్రికెటర్లను అనుమతించే ప్రసక్తే లేదు. ముందస్తు ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో మార్చి 29న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ అసాధ్యమే అని చెప్పాలి.

ప్రపంచవ్యాప్తంగా 114 దేశాలకు కరోనా వైరస్ ప్రబలింది. భారత్‌లో గురువారం 13 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 73 మంది ఈ వైరస్ బారిన పడినట్లు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పార్లమెంట్‌కు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 15 వరకు అన్నిరకాల విదేశీ వీసాలను రద్దు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. రాయబార, ఉద్యోగ వీసా తదితర కొన్ని రకాల వాటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. కరోనా ప్రపంచ అంటురోగంగా మారిన నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ జారీ చేసిన అన్ని ఆదేశాలను విధిగా పాటించాలని బీసీసీఐతో సహా అన్ని నేషనల్ స్పోర్ట్స్ అసోసియేషన్లను క్రీడల మంత్రిత్వ శాఖ కోరింది. పెద్ద ఎత్తున జనం పోగయ్యే క్రీడల నిర్వహణకు దూరంగా ఉండాలని కోరింది. అయితే, ముందస్తు షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఐపీఎల్ ప్రారంభం కావాల్సి ఉంది. వీసాల రద్దు, కేంద్ర వైద్య, క్రీడల మంత్రిత్వశాఖల సూచనల నేపథ్యంలో టోర్నీ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ తరుణంలో ఐపీఎల్ టోర్నీ భవితవ్యంపై చర్చించేందుకు ఈ నెల 14న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. ‘దేశంలోకి విదేశీయుల రాకపోకలపై ఆంక్షలున్న నేపథ్యంలో ఐపీఎల్ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నాం, జట్లకు నష్టపరిహారం చెల్లింపుపై శనివారం నిర్ణయం తీసుకుంటాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో దాదాపు ఈసారికి ఐపీఎల్ రద్దు అయినట్టేనని భావించవచ్చు.

Tags: ipl-2020,coronavirus, bcci, mulling holding, ipl

Next Story

Most Viewed