ఐపీఎల్ ఆదాయానికి 50శాతం గండి

by  |
ఐపీఎల్ ఆదాయానికి 50శాతం గండి
X

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐకి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది జరుగుతుందో లేదో అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ లీగ్‌ను సెప్టెంబర్‌-అక్టోబర్‌లో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. కాగా, ఈసారి ఐపీఎల్ జరిగినా ఆదాయంలో 50శాతం వరకు కోల్పోవలసి ఉంటుందని అమూల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోథి అంటున్నారు. ‘కరోనా కారణంగా పలు రంగాలు ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. ఈ ఆర్థిక సమస్యలు మరికొన్ని నెలలపాటు కొనసాగడం ఖాయం. ఇలాంటి సమయంలో ఐపీఎల్ నిర్వహిస్తే ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం సగానికి సగం పడిపోతుంది. గత ఏడాది ఐపీఎల్‌కు వెన్నుదన్నుగా నిలచిన వ్యాపార వర్గాలే ఇప్పటికీ బీసీసీఐతో ఉన్నారు. కానీ, వాళ్ల ఆదాయం మాత్రం గణనీయంగా పడిపోయింది. ఇలాంటి స్థితిలో అధిక మొత్తంలో వ్యాపార ప్రకటనలకు ఖర్చు చేయరు. ఇది తప్పకుండా ఐపీఎల్‌పై ప్రభావం చూపుతుంది’ అని సోథి అభిప్రాయపడ్డారు. గతంలో రాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదాలే కూడా ఇదే రకమైన అనుమానం వ్యక్తం చేశారు. గత ఏడాది స్టార్ ఇండియా ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే సమయంలో 10 సెకెన్ల ప్రకటనకు రూ.11 నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసింది. గత ఏడాది కంటే మరో 12శాతం ధర పెంచి ఈ ఏడాదికి కూడా 65శాతం ప్రకటనలను బుక్ చేసింది. కరోనా లాక్‌డౌన్‌కు ముందే డ్రీమ్ ఎలెవెన్ , బైజూస్, వివో, ఫోన్ పే, ఏసియన్ పెయింట్స్, ఖాతా బుక్, అమెజాన్ వంటి కంపెనీలు టీవీ యాడ్స్ కోసం అడ్వాన్స్‌లు చెల్లించాయి. ఇప్పుడీ కంపెనీలన్నీ ఐపీఎల్ జరిగితే యాడ్ ధరలు తగ్గించమని ప్రసారకర్త స్టార్‌ను కోరుతున్నట్లు తెలుస్తున్నది.

Next Story

Most Viewed