వరవరరావు విడుదలకు అంతర్జాతీయ మేధావుల లేఖ

by  |
వరవరరావు విడుదలకు అంతర్జాతీయ మేధావుల లేఖ
X

దిశ, న్యూస్ బ్యూరో: భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్‌యి మహారాష్ట్ర జైలులో ఉన్న పౌరహక్కుల నేత వరవరరావును, ఇతర కేసుల్లో దీర్ఘకాలంగా జైల్లో ఉంటున్న ఢిల్లీ ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌కు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అంతర్జాతీయ స్థాయి నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. అమెరికా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు నోమ్ చోమ్‌స్కీ, గుగీ వాథియాంగో, జెరాల్డ్ హోర్న్, హోమీబాబా, సుదీప్త కవిరాజ్ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా ఉన్న మొత్తం 133 మంది రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. పూర్తిగా పోలియో వ్యాధికి గురై వీల్‌చైర్‌కు మాత్రమే పరిమితమైన ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ సాయిబాబా 2014 నుంచి వివిధ కేసుల్లో జైల్లో ఉన్నారని, ఆయనను కలవడానికి వృద్ధాప్యంలో ఉన్న తల్లికి కూడా జైలు అధికారులు అనుమతి ఇవ్వడంలేదని పేర్కొన్నారు. మాతృభాష అయిన తెలుగు తప్ప మరో భాష తెలియని ఆమె తప్పనిసరిగా ఇంగ్లీషులో మాట్లాడితేనే ములాఖత్‌కు అనుమతి ఇస్తామని జైలు అధికారులు నిబంధన పెట్టారని ఆ లేఖలో మేధావులు పేర్కొన్నారు.

గత ఏడాదిన్నరకాలంగా ఉపా చట్టం కింద అరెస్టయ్యి తలోజా జైలులో ఉన్న పౌరహక్కుల సంఘం నేత వరవరరావును సైతం పెరోల్‌పై విడుదల చేయడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని, ఇప్పటివరకు ఛార్జిషీట్ కూడా దాఖలు చేయలేదని పేర్కొన్నారు. తలోజా జైలులో ఒక ఖైదీ కరోనా కారణంగా చనిపోయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వమే ఆ రాష్ట్ర హైకోర్టులో స్పష్టం చేసిందని, ఇలాంటి పరిస్థితుల్లో 80 ఏళ్ల వయసు దాటిన వరవరరావు వివిధ అనారోగ్య సమస్యలతో అదే జైల్లో ఉన్నారని, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విడుదలకు చొరవ తీసుకోవాలని లేఖలో కోరారు. గత నెల 28న అనారోగ్యంతో జైల్లో కుప్పకూలిపోయిన వరవరరావును జైలు సిబ్బందే ఆసుపత్రికి తరలించారని లేఖలో ప్రస్తావించారు. జైళ్లలో ఉన్న వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తున్నందునా వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడిందని, రాజ్యాంగం ప్రతీ ఒక్కరికీ జీవించే హక్కును ప్రసాదించినందున వీరిని విడుదల చేయాలని మేధావులు విజ్ఞప్తి చేశారు.

Next Story