ఆ కలెక్టర్‌కు ఆసక్తికర శిక్షవేసిన హైకోర్టు

by  |
Telangana High Court
X

దిశ, వెబ్‌డెస్క్: ధిక్కరణ కేసులో ఓ కలెక్టర్‎తో పాటు అధికారికి తెలంగాణ హైకోర్టు ఆసక్తికర శిక్ష విధించింది. సివిల్‌ సప్లయిస్‌ అధికారులు తనను అకారణంగా వేధిస్తున్నారంటూ వరంగల్‌ పట్టణానికి చెందిన పరమేశ్వర బిన్నీ రైస్‌ మిల్‌ యజమాని జి.చంద్రశేఖర్‌ 2016లో హైకోర్టును ఆశ్రయించారు. తనపై క్రిమినల్‌ కేసును సాకుగా చూపి ధాన్యం సరఫరాను చేయడంలేదని, ఇదే తరహా కేసులు ఉన్నవారికి సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సింగిల్‌ జడ్జి… పరమేశ్వర మిల్స్‌కు కూడా ధ్యానం సరఫరా చేసి బియ్యాన్ని కొనుగోలు చేయాలని అప్పటి వరంగల్‌ జాయింట్‌ కలెక్టర్‌ పాటిల్, డీఎస్‌వో సంధ్యారాణిలను ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈ ఆదేశాలను అమలు చేయకపోగా తనను మరింత ఇబ్బందులకు గురిచేశారంటూ 2016లోనే మిల్లు యజమాని చంద్రశేఖర్‌ కోర్టుధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేయగా, దీన్ని జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు విచారించారు. జేసీ పాటిల్, సంధ్యారాణిలు నిర్లక్ష్యంతో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఇద్దరికీ రూ. 2 వేల చొప్పున జరిమానా లేదా ఆరు వారాలపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

దీన్ని సవాల్‌ చేస్తూ పాటిల్‌ 2017లో అప్పీల్‌ దాఖలు చేశారు. కలెక్టర్ అప్పీల్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కలెక్టర్ పాటిల్‌కు ప్రతివారం 2 గంటల పాటు అనాథాశ్రమంలో పిల్లలతో గడపాలని, ఇలా 6 నెలల పాటు అమలు చేయాలని, డీఎస్‌వో సంధ్యారాణికి ఉగాది, శ్రీరామనవమికి హైదరాబాద్ లోని అనాథాశ్రయంలోని పిల్లలకు భోజనాలు సమకూర్చాలని కోర్టు తీర్పునిచ్చింది.


Next Story