పాపం.. వీళ్లకు ప్రభుత్వమే పైసలిచ్చి వాపస్ తీసుకుంది

by  |
పాపం.. వీళ్లకు ప్రభుత్వమే పైసలిచ్చి వాపస్ తీసుకుంది
X

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో మహిళా సంఘాలపై ప్రభుత్వం వడ్డీ భారం మోపుతోంది. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీని ఇవ్వలేమంటూ సమాచారమిస్తున్నారు. గతేడాది రూ.619 కోట్లు ఇచ్చినట్టే బీఆర్‌వో విడుదల చేసిన ప్రభుత్వం వాటిని తిరిగి తీసేసుకుంది. ఈ ఏడాదికి సంబంధించిన వాటికి దిక్కే లేకుండా పోయింది. దాదాపు రూ.4300 కోట్లకుపైగా వడ్డీ రాయితీ సొమ్మును ప్రభుత్వం మహిళలకు ఇవ్వకుండా చేతులెత్తేస్తోంది. దీంతో రాష్ట్రంలోని 46 లక్షల మంది డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పడుతోంది.

ప్రతిసారీ ఎదురుచూపులే

మహిళల ఉపాధి కోసం ప్రభుత్వం బ్యాంకుల నుంచి వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తోంది. 2011 నుంచి ఈ పథకాన్నిఅమలు చేస్తున్నారు. ఆ తర్వాత 2012లో వీటికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వమే చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. ఏటా నవంబర్ లేదా మార్చిలో మహిళా సంఘాల వడ్డీ రాయితీ సొమ్మును బ్యాంకులకు ప్రభుత్వం విడుదల చేస్తోంది. ముందుగా బ్యాంకుల నుంచి రుణాలు, స్త్రీ నిధి రుణాలను తీసుకున్న మహిళలు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాల్సి ఉంటోంది. ఆ తర్వాత రుణం తీరిపోయిన తర్వాత ప్రభుత్వం లెక్క కట్టి వారి వడ్డీని తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేస్తోంది. మహిళల ఉపాధి కోసం బ్యాంకుల నుంచి ప్రతి సంఘానికి రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు, స్త్రీ నిధి కింద వ్యక్తిగతంగా రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలిస్తున్నారు. వీటికి 13 శాతం నుంచి 13.5 శాతం వడ్డీతో మహిళలు బ్యాంకుల్లో వాయిదాల రూపంలో చెల్లింపులు చేస్తారు. ఆ తర్వాత వడ్డీ కింద చెల్లించిన సొమ్మును వడ్డీ రాయితీ కింద ప్రభుత్వం తిరిగి మహిళలకు ఇవ్వాల్సి ఉంది. 2018లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 14న ప్రభుత్వం రూ.930 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును మహిళా సంఘాల ఖాతాలకు బదిలీ చేసింది. అప్పటికే ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ రాయితీ సొమ్మును రూ.1100 కోట్లకు పైనే. ఎన్నికలు ముందుండటంతో ముందుగా రూ.930 కోట్లను సెర్ప్ ఖాతాకు బదిలీ చేసి, మిగిలిన వాటిని విడతల వారీగా ఇచ్చారు.

ఇవ్వడమే లేదు

గత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 6న ప్రభుత్వం రూ.619 కోట్లను మహిళా సంఘాల వడ్డీ రాయితీ కోసం విడుదల చేస్తున్నట్లు బీఆర్‌వో విడుదల చేసింది. అయితే సొమ్మును మాత్రం సెర్ప్ ఖాతాలో వేయకుండా అభయన్స్‌లో పెట్టింది. ఇప్పుడు, అప్పుడూ అంటూ వడ్డీ రాయితీ విడుదల చేయడం లేదు. 2019 నవంబర్ వరకు రూ.800 కోట్లకుపైగా వడ్డీ రాయితీ ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్ వరకు మరో రూ.600 కోట్లు ప్రభుత్వం బకాయి ఉంది. కానీ గతేడాది ఇచ్చిన వాటికే దిక్కు లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ సొమ్ము రావడం లేదని, గతేడాది నవంబర్‌లో ఇచ్చిన రూ.619 కోట్లు కూడా రావని, ఈ ఏడాది కూడా రావంటూ సెర్ప్ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. కరోనా కాలంలో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మహిళా సంఘాలే వడ్డీ భారాన్ని భరించుకోవాలంటూ గ్రామాల్లో స్పష్టం చేస్తున్నారు. దాదాపు ఈ రెండేండ్ల వ్యవధిలో ప్రభుత్వం రూ.1400 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును ఎగవేసేందుకు సిద్ధమైంది. 2018-19 సంవత్సరంలో రాష్ట్రంలోని మహిళా సంఘాలు బ్యాంకుల నుంచి రూ.6,800 కోట్ల అప్పులు తీసుకున్నాయి. 2019-20లో ఇప్పటి వరకు 2 లక్షల సంఘాలకు రూ.2,427 కోట్ల రుణాలిచ్చారు. గతేడాది తీసుకున్న రుణాలతో పాటుగా ఇప్పటి వరకు దాదాపుగా రూ.1400 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. కానీ వీటిలో రూ.619 కోట్లను ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంది.

మీదే భారం

ఈ ఏడాది బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీ నిధి రుణాల వడ్డీ రాయితీ సొమ్మును ఇవ్వలేమంటూ జిల్లా, మండల స్థాయిలో ఐకేపీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే 4.6 లక్షల సంఘాల్లోని 46 లక్షల మంది మహిళలకు వడ్డీ రాయితీ రావాల్సి ఉంది. రెండేండ్ల నుంచి రావాల్సిన వడ్డీ సొమ్మును అడిగితే అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. తాజాగా ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలిచ్చారని, 2018 నుంచి వడ్డీ రాయితీ సొమ్మును ఇవ్వలేమంటూ చెప్పారని స్పష్టం చేస్తున్నారు. రెండేండ్ల వడ్డీ భారాన్ని మహిళలే చెల్లించుకోవాలని, తిరిగి రావని చెబుతుండటంతో మహిళా సంఘాలు ఆందోళనలో ఉన్నాయి.


Next Story

Most Viewed