KTR గారు ఇటు చూడండి.. డ్రైనేజీలోకి దిగి TRS కార్పొరేటర్ భర్త..

by  |
KTR గారు ఇటు చూడండి.. డ్రైనేజీలోకి దిగి TRS కార్పొరేటర్ భర్త..
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై అధికార పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన చర్యలు చేపట్టడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త నిరసనకు దిగారు. బీఎస్ ముక్తా నుంచి హుస్సేన్ సాగర్ వైపు వెళ్లే నాలా వెడల్పు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమాజీగూడ కార్పొరేటర్ వనం సంగీతా యాదవ్ భర్త శ్రీనివాస్ యాదవ్ గురువారం నడుం లోతు మురుగు నీళ్లలోకి దిగి నిరసన వ్యక్తం చేశారు. గతేడాది వరదల సమయంలోనూ కేటీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించి సమస్యను గుర్తించి రూ.2 కోట్ల నిధులను కూడా మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు.

మళ్లీ వర్షాకాలం మొదలవుతుండటంతో డ్రైనేజీలు, నాలాలు వెడెల్పు పనులు చేయాలని మేయర్ కూడా తన పర్యటనలో చెబుతున్నట్టు వివరించారు. అయితే జనవరిలోనే పనులు మంజూరైనా ఈ నాలా వెడెల్పు పనులను పూర్తి చేయడం లేదని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అనేక సార్లు ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో చివరకు ఈ విధంగా నిరసన చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. శుక్రవారం పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ మేయర్ విజయ లక్ష్మీ, సంబంధిత ఈఈ హామీ మేరకు ఆయన నిరసన విరమించారు.


Next Story