షేర్ల బైబ్యాక్ ఆలోచనలో ఇన్ఫోసిస్

by  |
షేర్ల బైబ్యాక్ ఆలోచనలో ఇన్ఫోసిస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ ఏప్రిల్ 14న జరగబోయే బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్ ప్రణాళికను పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెక్యూరిటీల బై-బ్యాక్) ప్రకారం ఈ షేర్ల బైబ్యాక్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో తెలిపింది. 2020-21 మార్చితో ముగిసిన త్రైమాసిక, పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక ఫలితాలను వెల్లడించేందుకు ఏప్రిల్ 13,14 బోర్డు సమావేశం నిర్వహించనుంది. అనంతరం 14న ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌ను ప్రకటిస్తుంది. అదే సమయంలో షేర్ల బైబ్యాక్ అంశాన్ని వెల్లడించనున్నట్టు సమాచారం.

ఇన్ఫోసిస్‌తో పాటు భారత ఐటీ దిగ్గజాలు 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి, చివరి త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి. మొదటగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఏప్రిల్ 12న ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తుంది. ఇటీవల కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఐటీ దిగ్గజ కంపెనీల షేర్లు మెరుగ్గా ర్యాలీ చేస్తున్నాయి. గతవారంలో ఇన్ఫోసిస్ షేర్లు స్వల్పంగా లాభపడి షేర్ ధర రూ. 1,441 వద్ద ట్రేడయింది. ఇక, ఏడాది కాలంలో ఇన్ఫోసిస్ షేర్ 126 శాతానికిపైగా బలపడింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా కూడా రూ. 6 లక్షల కోట్లను దాటిన 4వ భారత ఐటీ సంస్థగా నిలిచింది.

Next Story

Most Viewed