ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం డౌన్

by  |
ఇండస్ఇండ్ బ్యాంక్ నికర లాభం డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ 2020-21 ఆర్థిక సంవత్సానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం రూ. 663.08 కోట్లతో 53 శాతం క్షీణించినట్టు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,400.96 కోట్ల లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 30 శాతం పెరిగిందని బ్యాంకు తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం స్వల్పంగా 1.6 శాతం తగ్గి రూ. 8,731.52 కోట్లకు చేరుకుంది.

గతేడాది ఇదే కాలంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ. 8,877.53 కోట్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే, ఈ త్రైమాసికంలో బ్యాంకు కేటాయింపులు రెట్టింపుతో రూ. 1,964.44 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే కాలంలో కేటాయింపులు రూ. 737.71 కోట్లని బ్యాంకు తెలిపింది. ఈ త్రైమాసికంలో బ్యాంకు కొవిడ్-19 నేపథ్యంలో రూ. 2,155 కోట్లను కేటాయించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి బ్యాంకు నికర వడ్డీ ఆదాయం రూ. 12.6 శాతం పెరిగి రూ. 3,278 కోట్లకు చేరుకుంది.

గతేడాది ఇది రూ. 2,909 కోట్లు. వడ్డీయేతర ఆదాయం 10 శాతం తగ్గి రూ. 1,554 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ 30 నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 2.19 శాతం నుంచి 2.21 శాతానికి పెరిగింది. నికర ఎన్‌పీఏలు 0.51 శాతానిక్ తగ్గాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం బ్యాంకు షేర్లు 0.53 శాతం తగ్గి రూ. 585.60 వద్ద ముగిశాయి.



Next Story